SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 11:31 pm Posted by : SHENARTHI MEDIA

వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్

  • మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
  • కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసులో అరెస్ట్
  • సాక్ష్యాలు తారుమారు చేసి, బాధితులను ప్రలోభపెట్టారన్న ఆరోపణలు
  • పలాస కోర్టు ఆదేశాలతో జైలుకు తరలింపు
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించారన్న తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఆయన్ను బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే, ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ కేసులో తన 18 ఏళ్ల కుమారుడిని కాపాడేందుకు అప్పలరాజు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన తన కుమారుడి స్థానంలో సిద్ధార్థ్ అనే మరో కుర్రాడిని నిందితుడిగా చిత్రీకరించేందుకు ఆయన యత్నించారని అభియోగాలు నమోదు చేశారు.

అంతేకాకుండా, మృతుడి కుటుంబాన్ని డబ్బుతో ప్రలోభపెట్టాలని చూశారని, కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను తారుమారు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బుధవారం అరెస్ట్ చేసిన తర్వాత, గురువారం పలాస జీజీహెచ్ లో అప్పలరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పలాస కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, అప్పలరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆయన్ను అంపోలు జైలుకు తరలించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.