SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 1:41 pm Posted by : SHENARTHI MEDIA

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

శెనార్తి మీడియా, కరీంనగర్ :
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ జి.ఎస్. ఆనంద్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని తారక హోటల్‌లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ జిల్లా డైరెక్టర్ కడారి అయిలన్న కురుమను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా నియమించారు.

ఈ సందర్భంగా జి.ఎస్. ఆనంద్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుకు ఫోరం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యమకారుల కోసం ఏర్పాటు చేసిన కే.కే కమిటీ కాలయాపన కమిటీగా కాకుండా నిర్దిష్ట గడువులో నిర్ణయాలు తీసుకునే కమిటీగా పనిచేయాలని సూచించారు. కమిటీ సభ్యులు త్వరలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి ఉద్యమకారుల సమస్యలు, పెండింగ్ హామీలపై నివేదిక సమర్పించి నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేకపోతే ఉద్యమాలు చేపట్టడం ఉద్యమకారులకు కొత్త కాదని, ఆందోళనలు కరీంనగర్ నుంచే ప్రారంభమవుతాయని హెచ్చరించారు.

గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కడారి అయిలన్న కురుమ తనపై నమ్మకం ఉంచిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారుల హక్కుల పరిరక్షణ, హామీల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు.

సమావేశంలో కలర్ సత్తన్న గౌడ్, గోడిశల రమేశ్ గౌడ్, బొల్లం లింగమూర్తి, పల్లె నారాయణ గౌడ్, మెతుకు సత్యం, కొండ్రా కుమార్, రవి యాదవ్, దావేర మహేశ్, గంగిపల్లి సతీష్, తోట రాకేష్, ప్రసాద్, పెద్దపల్లి మధుసూదన్, ఓగేటి బిందు, కారంగుల సుజాత, గడ్డం లత, తుమ్మనపల్లి రేణుక, కొరిమి పద్మ, ఉప్పరి శారదతో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.