SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 1:01 am Posted by : SHENARTHI MEDIA

రోడ్డు దాటడమే సవాల్

శెనార్తి మీడియా, శంకరపట్నం:

శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో జాతీయ రహదారి దాటడం గ్రామస్తులకు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. సర్వీస్ రోడ్డుకు ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారి మధ్యలో శాశ్వతంగా సిమెంట్ బారికేడ్లు నిర్మించడంతో రోడ్డుకు అవతలి వైపు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పొలాలు, దుకాణాలు, ఇతర అవసరాల కోసం నిత్యం రహదారి దాటాల్సి వచ్చే గ్రామస్తులు ఎక్కువ దూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు ప్రమాదాన్ని లెక్కచేయకుండా బారికేడ్ల మధ్య నుంచి రహదారి దాటేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పై చిత్రంలో కనిపిస్తున్న దృశ్యాలే గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే పరిశీలించి, గ్రామస్తులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.