శెనార్తి మీడియా, శంకరపట్నం:
అడపాదడపా కురుస్తున్న స్వల్ప వర్షాలకు ఆకర్షితులై రైతులు అధిక విస్తీర్ణంలో వరి నాట్లు వేయవద్దని సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎన్. శ్రీధర్ సూచించారు. శంకరపట్నం మండలంలోని తాడికల్, కరీంపేట గ్రామసభల్లో శుక్రవారం రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ కాల వ్యవధిలో పండే, తక్కువ నీటి అవసరం ఉండే పంటలైన పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. వర్షపు నీటిని వృథా కాకుండా ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలను ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసుకొని నీటి సంరక్షణ చేపట్టాలని రైతులకు సూచించారు.
అనంతరం పంటల నిర్వహణ, సాగు యాజమాన్య పద్ధతులు, ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జి. వెంకటేష్, తాడికల్ సహకార సంఘం చైర్మన్ సంపత్, కరీంపేట సర్పంచ్ లత, వ్యవసాయ విస్తరణ అధికారులు స్రవంతి, ఆరతి, రైతులు పాల్గొన్నారు.