శెనార్తి మీడియా, శంకరపట్నం:
ఎల్నినో ప్రభావంతో ఈ వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ సూచించారు.
ముత్తారం, చింతగుట్ట, కేశవపట్నం, మొలంగూరు, మెట్పల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతు అవగాహన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలైన పెసర, మినుము, వేరుశనగ, కంది, మక్కజొన్న పంటలను సాగు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. భూగర్భ జలాలు, సాగునీటి వనరులు సమృద్ధిగా ఉన్నప్పుడే వరి సాగు చేపట్టాలని సూచించారు.
వర్షపు నీటిని సంరక్షించేందుకు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలను ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసుకొని వినియోగించుకోవాలని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు సునంద, ఆరతి, కీర్తన, తిరుపతి, స్రవంతి పాల్గొని పంటల ఎంపిక, సాగు యాజమాన్య పద్ధతులు, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. సమావేశాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
