SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 4:28 pm Posted by : SHENARTHI MEDIA

రెండు రోజులుగా అచేతనంగా.. ఆసుపత్రికి తరలింపు

శెనార్తి మీడియా, హుజురాబాద్:

హుజురాబాద్ కేసీ క్యాంపు సమీపంలోని కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారి పక్కన గత రెండు రోజులుగా అచేతన స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని వృద్ధుడిని శనివారం 108 అంబులెన్స్ సిబ్బంది హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

స్థానిక కౌన్సిలర్, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ్య రహదారి పక్కన అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని గమనించి వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. దీంతో ఈఎంటీ గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ మతి గోపికృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన మాట్లాడలేని స్థితిలో ఉండటంతో ప్రథమ చికిత్స అందిస్తూ అంబులెన్స్‌లో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వృద్ధుడితో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ్య కూడా ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్సను పర్యవేక్షించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం వృద్ధుడిని కరీంనగర్‌లోని వృద్ధాశ్రమానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

గుర్తుతెలియని ఈ వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు లేదా ఆయన బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే స్థానిక అధికారులు లేదా ఐసీడీఎస్ సిబ్బందిని సంప్రదించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ్య విజ్ఞప్తి చేశారు.