శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామపంచాయతీ కార్యదర్శిపై గ్రామానికి చెందిన అన్నారపు తిరుపతి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
గ్రామసభ తీర్మానం లేకుండానే జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసి, తాగునీటి సరఫరా మోటార్ల నిర్వహణ పేరుతో లక్షల రూపాయల బిల్లులు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సంబంధిత దస్తావేజులు లేకుండానే ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేశారని, గ్రామ పెద్ద చెరువులో మట్టి తవ్వకాల విషయంలో కూడా లక్షల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
ఈ వ్యవహారాలపై గ్రామ ప్రజల సమక్షంలో సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు.