శెనార్తి మీడియా, శంకరపట్నం:
కొత్త నిబంధనల పేరుతో నిరుపేదలకు సామాజిక భద్రతా పెన్షన్లు దూరం చేయొద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో అధికారులు ఇటీవల జారీ చేసిన నిబంధనల ఉత్తర్వుల ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 57 సంవత్సరాలు నిండిన ప్రతి వృద్ధుడికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని, 40 శాతం పైబడిన దివ్యాంగులందరికీ పెన్షన్ అందించాలని, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి వితంతు మహిళకు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త నిబంధనలతో అర్హులైన వారికి పెన్షన్లు నిరాకరిస్తే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరం ఎలాంటి అదనపు నిబంధనలు లేకుండా అర్హులైన దరఖాస్తుదారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో అనితకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, కొయ్యడ అశోక్, దాసారపు నరేందర్, నిమ్మశెట్టి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, ఎల్కపెల్లి సంపత్, మందాడి జగ్గారెడ్డి, కనకం కుమార్, పడాల వెంకటలక్ష్మి, గూళ్ల రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.