SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 4:16 pm Posted by : SHENARTHI MEDIA

స్వాతంత్య్ర వేడుకలకు శ్రీకారం

శెనార్తి మీడియా, శంకరపట్నం:

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంకరపట్నం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలను ఘనంగా ప్రారంభించారు. ప్రిన్సిపాల్ కే. ప్రభాకర్ పోటీలను ప్రారంభించి, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు.

క్రీడా స్ఫూర్తి, దేశభక్తిని చాటిచెప్పే నినాదాలతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉత్సాహభరితంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనీ వాసుదేవ్ ఆధ్వర్యంలో విద్యార్థులను వివిధ జట్లుగా విభజించి కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు.

తెలుగు, ఇంగ్లీష్ విభాగాల ఉపాధ్యాయులు డా. మహేందర్, రాధా, సంధ్య, శంకర్, అనిత, రమణారెడ్డి ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వం, పద్య పఠనం, వచన కవితా రచన తదితర సాహిత్య, సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. పోటీలను 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు జూనియర్ విభాగంగా, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు సీనియర్ విభాగంగా నిర్వహించారు.

విద్యార్థులు అన్ని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, సతీష్, శివశంకర్, నాగమణి, ఆర్. రజిత, ఎస్. రజిత, వనజ, స్వప్న, మధుకర్, రజిని, అనిత తదితరులు పాల్గొని పోటీల నిర్వహణలో సహకరించారు. ఈ క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలు విద్యార్థుల్లో దేశభక్తి, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వ స్ఫూర్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.