SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:48 pm Posted by : SHENARTHI MEDIA

కనుమరుగవుతున్న పిచ్చుకల కిచకిచలు

శెనార్తి మీడియా, శంకరపట్నం:

ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం మారింది. పల్లెల రూపురేఖలు మారాయి. ఇళ్ల నిర్మాణశైలి నుంచి వ్యవసాయ పద్ధతుల వరకు వచ్చిన మార్పులు చిన్న పక్షుల జీవనాన్నీ ప్రభావితం చేశాయి. ఒకప్పుడు నిత్యం కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు అరుదుగా దర్శనమిస్తున్నాయి.

శంకరపట్నం మండలం కేశవపట్నంలో సోమవారం అంతరించిపోతున్న ఆరపిచ్చుకల గుంపు శెనార్తి మీడియా ప్రతినిధి కెమెరాకు చిక్కడం ఆసక్తిని రేకెత్తించింది. ఒకేచోట గుంపుగా కనిపించిన పిచ్చుకలు గత జ్ఞాపకాలను గుర్తుచేశాయి. ప్రస్తుతం గ్రామాల్లోనూ అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ పక్షులు రానున్న రోజుల్లో మరింత అరుదుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేశవపట్నంలో కెమెరాకు చిక్కిన ఆరపిచ్చుకల గుంపు కేవలం ఒక దృశ్యం కాదు.. మన పల్లెల్లో ఒకప్పుడు మారుమోగిన కిచకిచల జ్ఞాపకానికి ప్రతిబింబం. ఆ శబ్దం పూర్తిగా కనుమరుగయ్యేలోపు పిచ్చుకలకు మళ్లీ మన ఇళ్లలో చోటు కల్పించాల్సిన అవసరం ఉందని పక్షి ప్రేమికులు సూచిస్తున్నారు.