SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:08 am Posted by : SHENARTHI MEDIA

మంజునాథ మిల్లులో అధికారుల దాడి

  • 30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత

శెనార్తి మీడియా, మంచిర్యాల:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని అన్‌లోడ్ చేస్తుండగా సివిల్ సప్లైస్, టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా సుమారు 30 టన్నుల బియ్యంతో ఉన్న లారీని అధికారులు పట్టుకున్నారు.

మిల్లులో బియ్యం అన్‌లోడ్ చేసేందుకు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా అనే అంశంపై అధికారులు ఆరా తీశారు. పట్టుబడిన బియ్యం రేషన్ బియ్యమా? లేక ఇతర రకానికి చెందినదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.

మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులో గతంలోనూ ధాన్యం నిల్వలు, మిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపై ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిల్లులోని ధాన్యం నిల్వలు, కొనుగోలు, విక్రయాలు, తరలింపులకు సంబంధించిన రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

సీజన్‌ వారీగా మిల్లులకు కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ అనంతరం ఉన్న నిల్వలను అధికారులు లెక్కిస్తే అక్రమాలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ దాడిలో సివిల్ సప్లైస్ డీటీ స్రవంతి, టీఏ శంషుద్దీన్, టాస్క్‌ఫోర్స్ ఎస్సై డి.కొండ రమేష్, జైపూర్ ఆర్‌ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.