- రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్
శెనార్తి మీడియా, శంకరపట్నం:
భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్పట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయానికి చెందిన గ్రామ పాలన అధికారి (జీపీఓ) కంపేటి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గురువారం సాయంత్రం 5.47 గంటల సమయంలో శంకర్పట్నం తహసీల్దార్ కార్యాలయంలో కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు ఈ ట్రాప్ నిర్వహించారు.
ఏసీబీ విడుదల చేసిన ప్రెస్నోట్ ప్రకారం.. ఫిర్యాదుదారుడి నుంచి తొలుత రూ.15 వేలు డిమాండ్ చేసిన శ్రీనివాస్, అనంతరం మరో రూ.5 వేలు అదనంగా డిమాండ్ చేయడంతో మొత్తం రూ.20 వేలకు ఒప్పందం కుదిరింది. ఫిర్యాదుదారు అందించిన రూ.20 వేల లంచం మొత్తాన్ని శ్రీనివాస్ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అతని వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ చేతి వేళ్లతో పాటు ప్యాంటు వెనుక జేబుపై నిర్వహించిన రసాయన పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ లబ్ధి పొందేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు పేర్కొన్నారు.
శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన అధికారులు కరీంనగర్లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.