SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 8:32 am Posted by : SHENARTHI MEDIA

పోతన కాలనీలో కోతులు, వీధి కుక్కల బెడద

శెనార్తి మీడియా, గోదావరిఖని:
పోతన కాలనీలో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

కోతుల బెడదపై ఇప్పటికే ఆర్‌జీ-2 యాజమాన్యానికి పలుమార్లు సమస్యను తెలియజేసినా ఇప్పటివరకు సరైన పరిష్కారం లభించలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులతో పాటు వీధి కుక్కలు కూడా ప్రజలను వెంటాడుతూ దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు.

ఇటీవల కోతుల దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలలకు, వృద్ధులు బయటకు వెళ్లే సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామని తెలిపారు.

సమస్య మరింత తీవ్రతరం కాకముందే మున్సిపల్ అధికారులు, మేయర్‌తో పాటు ఆర్‌జీ-2 యాజమాన్యం స్పందించి పోతన కాలనీలో పరిస్థితిని పరిశీలించాలని ఓసీపీ-3 ప్రాజెక్ట్ సెక్రటరీ మామిడి తిరుపతి కోరారు. కోతులు, వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టి ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.