అల్లయ్య కుంటలో మునిగి బాలుడి మృతి
శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని అల్లయ్య కుంటలో మునిగి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన వీనా సాహిని, భవిత దేవి దంపతులు బతుకుతెరువు నిమిత్తం మొలంగూర్ గ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమారుడు రిత్విక్ (8) ఆదివారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అల్లయ్య కుంటలో పడి మునిగిపోయాడు. స్థానికులు బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

