శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన గాజుల మహేష్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మరోసారి ఉదారత చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం, ఆడ శిశువు జన్మిస్తే రూ.5 వేల నగదు అందజేస్తానని ఆయన ప్రకటించారు.
ఇటీవల గ్రామానికి చెందిన కొండ్ర ఎల్లయ్య మృతి చెందడంతో ఆదివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించిన గాజుల మహేష్, తన హామీ మేరకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇప్పటివరకు ఈ హామీ కింద ఏడోసారి ఆర్థిక సహాయం అందించడం విశేషం.
అలాగే గ్రామ ఉపసర్పంచ్ దండు రాజేష్ బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేసి అండగా నిలిచారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గాజుల మహేష్ను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

