- గడ్చిరోలిలో మళ్లీ మావోయిస్టుల కదలికలు
- ఎటపల్లి తాలూకాలో మావోయిస్టు కరపత్రాలు లభ్యం
- జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో గుర్తించిన భద్రతా బలగాలు
- అశోక్ కామ్రేడ్ పేరుతో విడుదలైన లేఖ
- గడ్చిరోలి-ఛత్తీస్గఢ్ సరిహద్దులో బలగాల కూంబింగ్
- తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులకు అలర్ట్
- సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచిన భద్రతా సంస్థలు
క్రైమ్ బ్యూరో, ( ప్రభంజనం ): దేశ వ్యాప్తంగా మావోయిస్టులను ఏరివేశామని, అందరూ లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భద్రతా బలగాలు మరో అడుగు ముందుకేసి కర్రెగుట్టలు, గడ్చిరోలీ లాంటి ప్రాంతాల్లో గతంలో మావోయిస్టులు దాచిపెట్టిన డంపులను, నిధులను వెలికితీసే పనిలో పడ్డారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టుల కదలికలు లేవని అందరూ అనుకుంటున్న వేళా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గడ్చిరోలి జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు బయటపడ్డాయి. ఎటపల్లి తాలూకాలో మావోయిస్టు కరపత్రాలు లభ్యం అయిన ఘటనతో మరోసారి మావోయిస్టుల కదలికలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో మావోయిస్టులు కరపత్రాలు గుర్తించాయి భద్రతా బలగాలు.
అశోక్ కామ్రేడ్ పేరుతో విడుదలైన లేఖలో ఇనుప ఖనిజ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని పిలుపునిస్తూ.. పోస్టర్లు వేశారు. కొత్త, పాత మైనింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్లు, గ్రామస్థులు కంపెనీలను వ్యతిరేకించాలని కరపత్రంలో పేర్కొన్నారు.

మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యారన్న ప్రచారం మధ్య ఈ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు గడ్చిరోలి-ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూంబింగ్ చేపట్టాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులను అలర్ట్ చేశారు. అలాగే రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు నిఘా పెంచాయి.

