శెనార్తి మీడియా, శంకరపట్నం:
కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తా నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు రోడ్డును విస్తరించి ప్రమాదాలను నివారించాలని కరీంపేట గ్రామానికి చెందిన నాయకులు కోరారు. ఈ మేరకు ఎంపీడీవో అనితకు సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ మార్గం ఇరుకుగా ఉండటంతో నిత్యం రద్దీగా మారుతోందని తెలిపారు. వీణవంక, జమ్మికుంట, శంకరపట్నం మండలాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగించే వాహనాలతో ట్రాఫిక్ పెరుగుతోందని పేర్కొన్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ చౌరస్తా నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు రోడ్డును అత్యవసరంగా విస్తరించాలని కోరారు.
కార్యక్రమంలో కరీంపేట మాజీ ఎంపీటీసీ గాండ్ల తిరుపతి, కేశవపట్నం మాజీ సర్పంచ్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు రాసమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

