వేములవాడ ఆలయాభివృద్ధికి మరో రూ.99.40 కోట్లు
శెనార్తి మీడియా, వేములవాడ: దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు ప్రభుత్వం మరో రూ.99.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే ఆలయ అభివృద్ధి కోసం 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు, 2024–25లో రూ.100 కోట్లు విడుదల కాగా, తాజాగా మరో రూ.99.40 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మొత్తం రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో సుమారు 45 శాతం పూర్తైనట్లు సమాచారం. తాజాగా నిధులు విడుదల కావడంతో మిగిలిన అభివృద్ధి, విస్తరణ పనులు మరింత వేగంగా పూర్తి కానున్నాయి.
ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

