శెనార్తి మీడియా, శంకరపట్నం:
పంద్రాగస్టున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా విజయవంతానికి కేశవపట్నంలోని ఓ గార్డెన్లో శనివారం బీజేపీ శంకరపట్నం మండల సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాడ వెంకట రెడ్డి మాట్లాడారు.
జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి కుటుంబం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాడ వెంకటరెడ్డి అన్నారు. కార్యక్రమాన్ని గ్రామగ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.
ఆగస్టు 12న కేశవపట్నంలో ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 13న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, ఆగస్టు 15న ప్రతి బూత్ పరిధిలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, దండు కొమురయ్య, జంగ జైపాల్, కొయ్యడ అశోక్, రసమల శ్రీనివాస్, నిమ్మచెట్టి సంపత్, చర్ల శ్రీనివాస్, కనకం సాగర్, దాసరపు నరేందర్, పడాల వెంకటలక్ష్మి, గుండ్ల లక్ష్మి, బోడ తిరపతి రెడ్డి, శ్రీనాథ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


