- అసలు ఉన్నాయా..? దాచేశారా…?
- హెడ్ నర్స్ లు ఎక్కడ..? సూపరింటెండెంట్ మౌనం ఎందుకు..?
GGH : మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో (GGH) శుభ్రతపై పెద్ద సందేహాలు నెలకొన్నాయి. ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేయాల్సిన బెడ్ షీట్లు సరిగా లేవని, రోగులు తమ వెంట బెడ్ షీట్లు తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపణలు పెద్ద మొత్తంలో వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారు బెడ్ షీట్లు లేని బెడ్ పైనే సేవలు పొందాల్సిన దుస్థితి నెలకొంది.

హెడ్ నర్స్ లు ఎక్కడ..? సూపరింటెండెంట్ మౌనం ఎందుకు..?
వార్డుల పర్యవేక్షణ బాధ్యతలో ఉన్న హెడ్ నర్స్లు ఏమైపోయారు..? వార్డుల్లో బెడ్ షీట్ల గురించి పట్టించుకునే వారే లేరా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బెడ్ షీట్లు ఉన్నాయా..! అనే అనుమానాలు ఓ వైపు వ్యక్తమవుతుంటే.., మరోవైపు మాయమై ఉంటాయనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించకపోవడంతో పర్యవేక్షణలో తీవ్ర లోపం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదీ ఏమైనా అధికారుల నిద్ర మత్తు వీడి ఆసుపత్రి పర్యవేక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లా ఉన్నతాధికారుల జోక్యం అవసరం
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పరిస్థితిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణం స్పందించాల్సిన అవసరముందని వైద్యం పొందుతున్న రోగులు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రోగుల కష్టాలు గమనించి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. పర్యవేక్షణ లోపాలను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మెలకువ తెచ్చుకుంటారా..? చూడాలి..!
ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రా రెడ్డిని వివరణ కోరగా దోబీకి 100 బెడ్ షీట్లు ఇస్తే తిరిగి 20 మాత్రమే ఇస్తున్నాడు. కాంట్రాక్టు లేకుండా మనదే బాధ్యత ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అన్ని సమస్యలకు వెంటనే స్పందిస్తున్నాం. బెడ్ షీట్లపై కూడా దృష్టి పెట్టి సమస్యను పరిష్కరిస్తా.
-శెనార్తి మీడియా, మంచిర్యాల :
