- గోదాం ముందు రైతుల ఆందోళన
- యాసంగిలోనూ ఎరువుల కష్టాలు రీపీట్
Urea app issues: ఖరీఫ్ సీజన్లో ఎదురైన ఎరువుల ఇబ్బందులు యాసంగి కాలంలోనూ రైతులను వెంటాడుతున్నాయి. యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేస్తే కొరత ఉండదని అధికారులు వెల్లడించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని రైతులు అంటున్నారు. యూరియా బస్తాలను యాప్ ద్వారానే కొనుగోలు చేయాలనే నిబంధన వల్ల మరింత గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నారు.
కొన్ని మొబైల్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ కావడం లేదని, డౌన్లోడ్ అయినా సరిగా పని చేయడం లేదని రైతులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక అవగాహన లేకపోవడంతో యాప్ విధానం భారంగా మారిందని పేర్కొన్నారు. ఆధార్ ఆధారంగా నేరుగా ఎరువుల దుకాణాల్లో యూరియా విక్రయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- కన్నాపూర్లో నిరసన
సాంకేతిక సమస్యలు, ఓటీపీ రాకపోవడం వంటి ఇబ్బందులతో యాప్ ద్వారా యూరియా కొనుగోలు సాధ్యం కావడం లేదని కన్నాపూర్ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం యూరియా సరఫరా గోదాం ఎదుట నిరసనకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో రాకపోలకు అంతరాయం ఏర్పడింది.
తాము నిరక్షరాస్యులమని, స్మార్ట్ ఫోన్లు వినియోగించడం తెలియదని రైతులు వెల్లడించారు. యాప్ విధానం వల్ల పంటలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. వెంటనే యాప్ నిబంధనను సడలించి, షాపుల ద్వారా నేరుగా యూరియా విక్రయించే విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

