Prime Minister modi
Prime Minister modi

National Space Day: అంతరిక్ష కలలకు కొత్త దిశ.. శాస్త్రవేత్తలకు ప్రధాని సందేశం

National Space Day: భారత్‌ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ప్రయోగాలు ఇప్పుడు సులభంగా సాధ్యమవుతున్నాయంటే, అందుకు శాస్త్రవేత్తల కృషే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంతరిక్షంపై మరింత పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేలా ప్రణాళికలు రచించాలని ఆయన శాస్త్రవేత్తలను ఉత్సాహపరిచారు.

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, భారత అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన భవిష్యత్‌ లక్ష్యాలను వివరించారు. 2040 నాటికి భారత్‌ సొంతంగా చేపట్టే చంద్రయాత్రలో దేశీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతకాన్ని ఎగురవేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందే భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, గగన్‌యాన్‌ మిషన్‌ను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

భవిష్యత్తులో ప్రతి ఏడాదికీ 50 రాకెట్ ప్రయోగాలు జరగగల స్థాయికి భారత్‌ చేరుకోవాలని మోదీ శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తూ, ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మానవాళి భవిష్యత్తు కోసం అంతరిక్షంలో దాగి ఉన్న కొత్త రహస్యాలను ఛేదించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. యువతను కూడా అంతరిక్ష మిషన్లలో భాగం కావాలని కోరారు.

ఇస్రో ఇప్పటికే గగన్‌యాన్ ప్రాజెక్టు కింద నాలుగు మంది వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేసిందని, వీరందరూ భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్‌ పైలట్లు అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాబోయే సంవత్సరాల్లో వీరిని దిగువ భూకక్ష్యలోకి పంపి, అక్కడి నుంచి విజయవంతంగా తిరిగి తీసుకురావడం ప్రణాళికలో ఉందని తెలిపారు.

అంతరిక్ష అన్వేషణలో భారత్‌ కొత్త అధ్యాయాన్ని రాయబోతున్నదని, శాస్త్రవేత్తలు చూపిస్తున్న నిబద్ధతతో అది దూరం కాని స్వప్నమని ప్రధాని మోదీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *