- అనుమతి లేని పాఠశాలను పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రారంభించారని విమర్శలు…
- కార్పొరేట్ పాఠశాలల అరాకచకంపై ఏబీవీపీ పోరాటం…
STUDENT UNION : పెద్దపల్లి పట్టణంలోని లక్ష్య్ ఇంటర్నేషనల్ పాఠశాల చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. పాఠశాల యాజమాన్యం అనుమతులు పొందకుండానే కార్యకలాపాలు ప్రారంభించడమే కాదు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును ఆ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం తీవ్ర విమర్శల పాలవుతోంది. అనుమతులు లేకుండా లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభంపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని కోరింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే విజయరమణారావు అనుమతులులేని పాఠశాలను ప్రారంభించడం అర్థరహితమైన చర్యగా అభివర్ణించారు. ఇది ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యానికి నిదర్శనముగా కన్పిస్తోందని, కార్పొరేట్ పాఠశాలలు విద్యా నిబంధనలను తుంగలో తొక్కుతూ పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఇలా ప్రారంభించడపై పలువురు మండిపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనేక వసతులు కలగజేసే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటె, పెద్దపల్లి ఎమ్మెల్యేకి కార్పొరేట్, ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడంపై ఆయనకు ఉన్న ఉత్సహం ఏమిటో అర్ధం కావడం లేదని అన్నారు. లక్ష్య్ ఇంటర్నేషనల్ పేరుతో కాకుండా మరో పేరుతో కూడా పాఠశాల నడుపుతూ, అడ్మిషన్లు చేపడుతున్న తీరును అజయ్ ఎండగట్టారు. అనుమతులు పొందని పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోంది. విద్యా నియంత్రణల మీద అన్యాయం చేసే ప్రయత్నాలను మేము సహించబోము అన్నారు.
అనంతరం జిల్లా విద్యాధికారిని కలసిన ఏబీవీపీ ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే, మరింత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు బండి రాజశేఖర్, రాసురి ప్రవీణ్, అరవింద్, సాయి తేజ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, కరీంనగర్ ప్రతినిధి :