- కేశవపట్నం పోలీస్స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి
SI Shekar Reddy: ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కేశవపట్నం పోలీస్స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి, ఒంటరితనం, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల లోపం వంటి కారణాల వల్ల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ఎవరైనా ఒంటరిగా ఉండటం, చావు గురించి మాట్లాడటం, తీవ్ర నిరాశలో ఉండటం, ఆత్మహత్యకు ఉపయోగించే సాధనాలను సమకూర్చుకోవడం వంటి పరిస్థితులు గమనిస్తే, వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తం కావాలని సూచించారు.
సమయానికి చికిత్స, మానసిక బలమే పరిష్కారం
అటువంటి వారిని మానసిక వైద్యులకు చూపించి, కౌన్సెలింగ్, మెడిటేషన్ ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు, సహకారం లభిస్తే చాలా వరకు ఆత్మహత్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.
ఆత్మహత్య చేసుకునే వారిలో రెండు రకాలున్నాయని చెప్పారు. కొందరు క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటారు. అటువంటి వారిని ఆపగలిగితే, తర్వాత వారు తాము చేసిన తప్పును గ్రహిస్తారని అన్నారు. మరికొందరు డిప్రెషన్, మానసిక సమస్యలతో బాధపడతారని, వారిని సమయానికి కౌన్సెలింగ్ లేదా మెడిసిన్తో నయం చేసి రక్షించవచ్చని తెలిపారు.
తల్లిదండ్రుల బాధ్యత కీలకం
తల్లిదండ్రులు పిల్లలపై చదువుల ఒత్తిడిని తగ్గించాలని, యువతకు తరచూ కౌన్సెలింగ్ ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు పిల్లలు సైకియాట్రిస్టులను కలవాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
