- సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలి
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
- బద్దిపల్లిలో రైతు అవగాహన సదస్సు
CROP ROTATION : రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం కొత్తపల్లి మండలం బద్దిపల్లి రైతు వేదికలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ యూరియా విరివిగా వాడడం వల్ల భవిష్యత్ తరాలకు నేల పనికిరాకుండా పోయే అవకాశం ఉందని అన్నారు. వీలైనంత తక్కువగా రసాయనాలను వాడాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వల్ల దిగుబడిలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. దుక్కి దున్నడం నుండి పంట కోత వరకు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు. నాసిరకం, ఎరువులు పురుగుమందులు వాడకం వల్ల రైతు నష్టపోయే అవకాశం ఉందని, డీలర్ల వద్ద కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని తెలిపారు.

లాభాలు సాధించడంలో, నేల స్వభావాన్ని తిరిగి పొందడంలో పంట మార్పిడి విధానం ఉత్తమమైనదని అన్నారు. వరికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా చిరుధాన్యాలు, పండ్లు, పూల మొక్కలు, కూరగాయల పెంపకం వంటి వాటిని సాగు చేయాలని, తద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని తెలిపారు. ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా విపరీతమైన కాలుష్యంతో పాటు వృక్ష సంపదకు వాటిల్లుతొందని వివరించారు. చెట్లను కాపాడాలన్నారు. అనంతరం సాగు విధానానికి అవలంబించవలసిన పద్ధతులపై కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, శాస్త్రవేత్తలు ఉషారాణి, మధుకర్ రావు, శ్రావణి, విద్యా భాస్కర్, మదన్మోహన్ రెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్ :