- ప్రభుత్వం మారితే పునఃప్రారంభాలా..?
- శిలాఫలకాల పాలిటిక్స్ పై ప్రజల్లో వ్యంగ్యపు చర్చ..

STONE FOUNDATION : జిల్లా అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ మార్పుతోపాటు శంకుస్థాపనల పునరావృతం కొత్త చర్చకు దారితీస్తోంది. ఒకే అభివృద్ధి పనికి రెండు సార్లు శంకుస్థాపన చేయడం ద్వారా ప్రజాధనంతో రాజకీయ ప్రాచుర్యం పొందే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నవారి పేర్లు శిలాఫలకాలపై ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో గతంలో జరిగిన ప్రారంభాలను పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ ప్రారంభోత్సవాల నాటకాలు ఆడుతున్నారని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. మందమర్రి మండలంలోని క్యాతనపల్లిలో నిర్మితమవుతున్న ఓవర్బ్రిడ్జ్కు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బ్రిడ్జ్ను మళ్లీ ప్రారంభించి తన పేరుతో శిలాఫలకం ఆవిష్కరించారు. ఇదే తంతు మంచిర్యాలలోనూ పునరావృతమైంది.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి క్యాతనపల్లి వరకు రూ.35 కోట్లతో చేపట్టాల్సిన రోడ్డువిస్తరణ పనులకు 2023లోనే శంకుస్థాపన జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం అదే పనిని కొంత మార్పుతో మళ్లీ ప్రారంభించడం హాస్యాస్పదమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఒకే పనికి రెండుసార్లు శంకుస్థాపనలు అవసరమా..? ప్రజలకంటే శిలాఫలకాలకే అధిక ప్రాధాన్యతా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు దీన్ని పాతదాన్ని కొత్తగా మలిచి ప్రజల మదిని మాయచేసే ప్రయత్నంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించి పార్టీ పత్రికలకే సమాధానాలిచ్చే ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి పనుల వైఖరిలో మార్పు రావాలే కానీ, శంకుస్థాపనలలో పునరావృతం ప్రజాస్వామ్యానికి చేటు అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

–పాత పనులకు మళ్లీ శంకుస్థాపన హాస్యాస్పదం: దివాకర్ రావు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.35 కోట్లతో మంజూరైన ఐబీ చౌరస్తా నుంచి క్యాతంపల్లి వరకు రోడ్డుపనులకు 2023లోనే శంకుస్థాపన చేశామని, ఇప్పుడు అదే పనికి మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విమర్శించారు. వేదికలు, పేర్లు మార్చి ప్రజలను మోసం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదు అని మండిపడ్డారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల: