- రైతుల్లో ఆసక్తి కలిగించిన ఐఎఫ్ఎఫ్సీఓ ప్రోగ్రాం
Nano Urea demonstration: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో ఐఎఫ్ఎఫ్సీఓ ఆధ్వర్యంలో డ్రోన్ సాయంతో నానో యూరియా పిచికారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగట్టు పరిధిలోని వరి పొలాల్లో ఈ ప్రదర్శన నిర్వహించగా, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, పలువురు అధికారులు, రైతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెట్పల్లీ ప్యాక్స్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మనకొండూరు ఏడీఏ శ్రీధర్, శంకరపట్నం ఏఓ వెంకటేష్, ఐఎఫ్ఎఫ్సీఓ డీఎం బాలాజీ హాజరై రైతులకు డ్రోన్ స్ప్రే వ్యవస్థపై అవగాహన కల్పించారు. డ్రోన్ సాయంతో నానో యూరియా పిచికారీ చేయడం వల్ల సమయంతో పాటు శ్రమ, ఖర్చు తగ్గుతాయని, పంటల దిగుబడిలో వృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ప్రత్యేకించి ట్రాక్టర్, మానవశ్రమ అవసరం లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందు పిచికారీ చేయవచ్చని చెప్పారు.
రైతులు ఈ కార్యక్రమానికి హాజరై డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ విధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తమ సందేహాలను అధికారులు, ఐఎఫ్ఎఫ్సీఓ ప్రతినిధుల నుంచి నివృత్తి చేసుకున్నారు. ఈ టెక్నాలజీని స్వీకరిస్తే వ్యవసాయంలో సమర్థత పెరుగుతుందని కొంతమంది రైతులు అభిప్రాయపడ్డారు.

ఐఎఫ్ఎఫ్సీఓ అధికారుల ఆధ్వర్యంలో మరిన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్/ శంకరపట్నం:
