- జంక్షన్ల కూల్చివేతపై రాస్తారోకో…
- బీఆర్ఎస్, పోలీసుల మధ్య తోపులాట
BRS CONCERN : గోదావరి నదిపై మంచిర్యాల – అంతర్గాం మధ్య నిర్మించ తలపెట్టిన వంతెనను రద్దు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ (BRS) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే (Ex MLA) నడిపెల్లి దివాకర్ రావు నేతృత్వంలో, పార్టీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ రూ. 164 కోట్లతో పూర్తయ్యే బ్రిడ్జిని రూ. 450 కోట్లతో ముల్కల-ముర్మూర్ మధ్య నిర్మించాలనుకోవడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని, గతం నుంచే మంచిర్యాల అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే(MLA) పీఎస్సార్ (PSR) తన అధికారాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్టును అడ్డుకున్నాడని ఆరోపించారు.

జంక్షన్ల కూల్చివేతపై రాస్తారోకో… బీఆర్ఎస్, పోలీసుల మధ్య తోపులాట
మంచిర్యాలలో బీఆర్ఎస్ (BRS) హయాంలో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నాలుగు జంక్షన్లను ప్రభుత్వం కూల్చివేయడాన్ని నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఉద్రిక్తతలో సివిల్ డ్రెస్ (CIVIL DRESS) లో ఉన్న ఐడి (ID) పార్టీ కానిస్టేబుల్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తనయుడు విజిత్ రావును బలవంతంగా లాగడానికి ప్రయత్నించడంతో, బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు అతను తమ వ్యక్తి అని తెలియజేయడంతో గందరగోళం పరిస్థితి అదుపులోకి వచ్చింది.
పెద్ద కుట్ర జరుగుతోంది… మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు
అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని నాశనం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని, ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులను అడ్డుకోవడాన్ని ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ ఆందోళనతో మంచిర్యాలలో రాజకీయ వేడి పెరిగింది. బ్రిడ్జి నిర్మాణాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ బలపడగా, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.
-శెనార్తి మీడియా, మంచిర్యాల: