100 Years Family
100 Years Family : ఒకే వేదికపై కళ్లెం కుటుంబ సభ్యులు

100Years Family:  వందేండ్ల  ‘కళ్లెం’

  • సకుటుంబ సపరివార సమేతంగా ఆత్మీయ సమ్మేళనం
  • పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కళ్లెం వారసులు
  • సాంబయ్యపల్లె వేదికగా కలిసిన కుటుంబాలు
  • దాదాపు వంద మందిపైగా ఉన్న కుటుంబ సభ్యులు

100Years Family:  ఇప్పటి వరకు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాల గురించి విన్నాం. తరగతి గది ముచ్చట్లతో, నాటి జ్ఞాపకాలతో తడిసిముద్దయిన వారిని చూశాం. ఇప్పుడు వందేళ్ల జ్ఞాపకాలతో నిండిన ఆత్మీయ సకుటుంబ సపరివార సమ్మేళనం గురించి మీరంతా తెలుసుకోబోతున్నారు. శతాబ్దం క్రితం చిగురించిన బంధం కళ్లెం, గడ్డం వారి సంబంధం. నాడు ఒక్కటైన కుటుంబాలు.. వారి ఆత్మీయ బంధాలు నేటికీ పరిమళగంధాలను వెదజల్లుతూనే ఉన్నాయి.

కళ్లెం వారి తనయుడు రాంరెడ్డి, గడ్డం వారి గారాలపట్టి రామవ్వను వివాహం చేసుకున్నారు. నాటి ఏడడుగుల బంధం.. వందేళ్లైనా సగర్వంగా తమ గొప్పతనాన్ని చాటుతూ ఆదర్శకుటుంబంగా నిలుస్తోంది. కళ్లెం, గడ్డం వారి ఇంట అల్లుకున్న ఈ మమతల బంధం.. ఎక్కడెక్కడికో విస్తరించింది. ఆ బంధాలు నేడు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాయి. తమ పెద్దల స్మృతులను తలుచుకుంటూ ఆనందోత్సవాలతో ఒక్కటయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. 100 ఏళ్ల క్రితం ర్యాగంపేటకు చెందిన కళ్లెం రాంరెడ్డి.. సాంబయ్యపల్లె (Sambaiahpalli)కు చెందిన గడ్డం(Gaddam) వారి ఇంటి అమ్మాయి రామవ్వను పెళ్లి చేసుకున్నారు. అయితే తమ బిడ్డ తమకు దూరంగా వెళ్లిపోవడం ఇష్టంలేని రామవ్వ తల్లిదండ్రులు అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. అల్లుడు రాంరెడ్డికి ఆస్తిలో వాటా ఇచ్చి తమ ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. అప్పటి నుంచి కళ్లెం కుటుంబం గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లెలోనే ఉంటుంది. కళ్లెం రాంరెడ్డి, రామవ్వ దంపతులకు ముగ్గురు కొడుకులు కలిగారు. కళ్లెం వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, బలరాం రెడ్డి వారి పేర్లు. వీరికి కొడుకులు, కూతుళ్లు, మనుమలు, మనుమరాండ్లు దాదాపుగా 100 మంది ఉన్నారు. వీరంతా తమ తమ కుటుంబాలతో వేర్వేరు గ్రామాల్లో నివసిస్తున్నారు.

ఇదిలా ఉంటే, కళ్లెం వా(Kallem)రి కుటుంబంలో అతిపెద్ద మలుపు 1982 సంవత్సరం. అప్పటి వరకు ఒకే ఊళ్లో ఉన్న ఈ కుటుంబాలు.. ఆ ఏడాది చేపట్టిన కరీంనగర్ డ్యాం నిర్మాణంతో దూరం అయ్యాయి. రెండు కుటుంబాలకు సంబంధించిన భూమి మినహా, మిగిలిన కళ్లెం కుటుంబాల వ్యవసాయ భూమి డ్యాంలో ముంపునకు గురి అయ్యింది. దీంతో వాళ్లంతా వివిధ గ్రామాలకు వలస వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన కుటుంబాలు తమ తమ జీవనోపాధులతో కాలం గడుపుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే కళ్లెం కుటుంబంలో ఒగులాపూర్‌కు చెందిన కళ్లెం ఎల్లారెడ్డికి, మాదాపూర్‌కు చెందిన కళ్లెం మల్లారెడ్డికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. ఒక పాఠశాలలో చదివుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటున్నారు. మరి ఒకే కుటుంబానికి చెందిన తామంతా ఎందుకు ఆత్మీయ కలయికను వేడుకగా జరుపుకోరాదని భావించారు. ఆలోచన వచ్చిందే తడవుగా కుటుంబం తరుపున ఆత్మీయ సమ్మేళనానికి పిలుపునిచ్చారు. ఎక్కడెక్కడో ఉన్న తమ ఇంటి వారిని అందరికీ కబురు అందించారు. తమ వారి పిలుపుతో అన్ని కుటుంబాలు ఒక్క చోటికి చేరాయి. దీనికి వేదికగా నిలిచింది సాంబయ్య పల్లె (Sambaiahpalle).

తమ తాతలు నడిచిన ప్రాంతంలోనే ఆ కుటుంబాలు ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడో తమ తమ పనుల్లో మునిగిపోయిన వారంతా.. కష్ట, నష్టాలను, సుఖ, దుఃఖాలను పంచుకున్నారు. ఆటపాటలతో సందడి చేశారు. వినోదాల్లో మునిగితేలారు. తమ కుబుంబ పెద్దలు రాంరెడ్డి, రామవ్వలను మనసారా తలుచుకుని వారి ఆశీస్సులు పొందారు.

-శెనార్తి మీడియా, గన్నేరువరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *