- యూరియా యాప్ గందరగోళం
- మొలంగూర్లో రైతుల ధర్నా
- రైతులను సముదాయించేందుకు వ్యవసాయాధికారుల తంటాలు
Urea App Protest: శంకరపట్నం మండలంలోని మెట్పల్లి సహకార సంఘం పరిధిలో ఉన్న మొలంగూర్ సింగిల్ విండో గోదాం వద్ద జరిగిన పరిణామం వ్యవసాయ రంగంలో డిజిటల్ విధానాల అమలుపై మరోసారి చర్చకు దారి తీసింది. గోదాంకు వచ్చిన 450 యూరియా బస్తాలు కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా పంపిణీ అయిపోవడంతో ఎరువు అందని రైతులు ఆగ్రహంతో గోదాం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అవసరమైన సమయంలో ఎరువు దొరకకపోవడం పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల ప్రధాన అభ్యంతరం ‘యూరియా యాప్’ వ్యవస్థపైనే ఉంది. పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ బుకింగ్ విధానం గ్రామీణ పరిస్థితులకు సరిపోవడం లేదంటున్నారు. మొబైల్ ఫోన్లో యాప్ ఓపెన్ చేసి బుకింగ్ చేసేలోపే నిల్వలు కనిపించకుండా పోతున్నాయని, కొంతమందికి ఫోన్ నంబర్లు లింక్ కాకపోవడంతో బుకింగ్ పూర్తవడం లేదని తెలిపారు. డిజిటల్ అవగాహన, నెట్వర్క్ సమస్యలు రైతులకు అదనపు భారంగా మారుతున్నాయని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రైతులు యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ అక్కడికి చేరుకుని రైతులను సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. సహకార సంఘాల పరిధిలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, మొబైల్ నంబర్ లింక్ సమస్యలు లేదా ఆన్లైన్ నమోదు ఇబ్బందులు ఉంటే వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదిస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే అదనపు బస్తాలు కూడా తెప్పిస్తామని తెలిపారు.
ఏవో ఆదేశాల మేరకు ఏఈఓలు అక్కడికక్కడే కొంతమంది రైతుల ఫోన్ నంబర్లను లింక్ చేసి, యూరియా బుకింగ్ విధానం పై అవగాహన కల్పించారు. అయితే ఈ సంఘటన ఒక కీలక ప్రశ్నను లేవనెత్తింది. సాంకేతిక విధానాలు అమలు చేసే ముందు గ్రామీణ స్థాయిలో తగిన మౌలిక వసతులు, శిక్షణ, ప్రత్యామ్నాయ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయా? వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ అవసరమైనదే అయినప్పటికీ, అది రైతులకు అడ్డంకిగా కాకుండా సహాయకారిగా మారేలా వ్యవస్థను పునఃపరిశీలించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నిరసన కార్యక్రమంలో రైతులతో పాటు టీడీపీ నాయకులు మోరే ప్రభాకర్, దాసారపు సాగర్ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం

