- యాదవ సంఘాల హెచ్చరిక
Yadav’s Demands: రాజకీయ పార్టీలు యాదవులకు పదవులు కల్పించకుంటే పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తామని యాదవ సంఘాల నాయకులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యాదవ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సలేంద్ర రాములు యాదవ్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలారపు పర్వతాలు యాదవ్ మాట్లాడారు. గత 20 నెలలుగా గొర్రెలకు, మేకలకు అవసరమైన మందులు ఇవ్వడం లేదని, జీవాల ఆరోగ్యంపై పశుసంవర్థక శాఖ పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తు్న్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవులను పూర్తిగా విస్మరించిందని, రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినా ఒక్క యాదవులకు ఒక్క స్థానం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులలోనూ, పార్టీ పదవులలోనూ ప్రాతినిధ్యం కల్పించకుండా అవమానిస్తున్నదని మండిపడ్డారు.
ఈ నేపథ్యంతోనే గాంధీభవన్ కు గొర్రెలను తీసుకెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేశామని, దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గొర్రెల మేకల పెంపకందారుల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ పదవిని పెద్దపల్లి జిల్లాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాను పశుసంవర్థక శాఖకు మోడల్ జిల్లాగా గుర్తించాలన్నారు.
మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చొరవ చూపాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఆయా పార్టీలు యాదవులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతతే ఆయా పార్టీ కార్యాలయాలను గొర్రెలతో ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జీకేఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల నాగరాజ్ యాదవ్, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, మేకల నరసయ్య యాదవ్, దాడి చంద్రమౌళి యాదవ్, దాడి సదయ్య యాదవ్, మల్లెత్తుల నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, పెద్దపల్లి