Escape College Owner:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల యాజమాన్యం సుమారు రూ.8కోట్లు టోకరా వేసి పరారైనట్లు తెలిసింది. సదరు కళాశాల నిర్వాహకులకు అప్పులు ఇచ్చిన వారు దాదాపు 50 మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తున్నది. నిర్వాహకులు పరారవడంతో అప్పులుయ ఇచ్చిన వారిలో కొందరు న్యాయం కోసం శనివారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
బాధితుతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల లోని ప్రతిభ కళాశాల యాజమాని రిక్కల మహేందర్ రెడ్డి కళాశాల, భవనం విక్రయించి వెళ్లిపోయాడని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాలకు సంబంధం లేని అతడి స్నేహితుడు లక్షెట్టిపేటకు చెందిన మరో ప్రైవేట్ (వైష్ణవి) కళాశాల యజమానికి అప్పగించాడని పేర్కొంటున్నారు. లక్షెట్టిపేటకు సంబంధించిన వైష్ణవి కళాశాల ప్రిన్సిపాల్

కిరణ్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.6వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో చదువులకు వెళ్లేందుకు టీసీ, సర్టిఫికెట్లు అవసరం ఉంది. దీంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సదరు కళాశాల నుంచి సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక సీఐని సంప్రదించగా.. విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు .బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని తెలిపారు.
మా దృష్టికి వచ్చింది.. ఉన్నతాధికారులకు తెలియజేశాను : మంచిర్యాల డీఐఈఓ
ఈ మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులకు తెలియజేశాం. విద్యార్థులకు సర్టిఫికెట్లకు సంబంధించి సోమవారం పై నుంచి స్పష్టత వస్తుంది.వచ్చిన తరువాత ఏం చేయాలో వెల్లడిస్తాం. ప్రస్తుతం ఆ కళాశాల వారు ఈ సంవత్సర కళాశాల నడపను అని మాకు తెలిపారు. పై నుంచి వచ్చే ఆదేశాలకోసం వేచి చూస్తున్నాం.