Police Attacks : నిషేధిత గుడుంబాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గుడుంబా స్థావరాల పై పోలీస్, ఎక్సైజ్ అధికారులు శుక్రవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో గుడుంబా తయారు చేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు.
గుడుంబా తయారీకి ఉపయోగించే 900 లీటర్ల బెల్లం పానకం, 12 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారు చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిషేధిత గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నాటుసారా తాగి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో కోటపల్లి పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల