- ఎక్స్ పైరి డేట్ దాటినా యథేచ్ఛగా శీతల పానీయాలు, తినుబండారాల అమ్మకాలు
- ప్రజల ప్రాణాలతో చెలగాటం..
- లక్షెట్టిపేటలో కూల్ డ్రింక్స్ తాగిన చిన్నారులకు అస్వస్థత
- పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు
SALE OF EXIPRE DATED : కిరాణా షాపులు, ఇతర తినుబండారాల విక్రయ షాపుల్లో గడువు తీరిన ఆహార పదార్థాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వ్యాపారులు. ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఓ కిరాణ దుకాణం లో కాలం చెల్లిన శీతల పానీయాల విక్రయం వెలుగులోకి వచ్చింది.
పట్టణంలోని ప్రముఖ గోదావరి కిరాణ షాప్లో ఓ వ్యక్తి మజా కొనుగోలు చేసి చిన్నారులకు తాగించాడు. అది తాగిన పది నిమిషాల వ్యవధిలోనే పిల్లలు వాంతులు చేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు మజా బాటిల్ చూసేసరికి గడువు తీరిన తేదీ కనిపించడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. షాప్ యజమానిని నిలదీయడంతో దాటవేసే ప్రయత్నం చేశాడు. దానితో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం తో ఎస్సై పూర్తి వివరాలు తెలుసుకొని వినియోగదాడురికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పట్టణంలో ఇలాంటి ఔట్ డేటెడ్ కూల్ డ్రింక్లను కిరాణా షాప్లలో చౌక ధరలకు వేస్తున్నారు. కానీ కస్టమర్ల వద్ద మాత్రం ఎమ్మార్పీపై పై 5 రూ. అదనంగా కూలింగ్ చార్జీ అని ముక్కు పిండి మరీ వసూలు చేస్తుండటం గమనార్హం. ఈ డ్రింక్స్ని చిన్న పిల్లలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కాలం చెల్లినా కూడా వీటినే మార్కెట్లో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

శీతలపానీయాలైన మాజా, పల్పీ ఆరంజ్, అప్పి, ఫిజ్ వంటి డ్రింక్స్ని కాలం చెల్లిన తర్వాత కూడా కిరాణ దుకాణాల్లో వేసి డీలర్లు, యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కానీ ఇదంతా సంబంధిత అధికారులకు కనిపించడం లేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ డేటెడ్ డ్రింక్స్ని ఒక కాటన్కి బదులు రెండు కాటన్లు వేస్తూ డీలర్లు, కిరాణా షాపు యజమానులతో చేతులు కలిపి కస్టమర్లని ఆర్థికంగా దోచుకోడంతో పాటు ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.
సంబంధిత అధికారులు దాడులు నిర్వహించి కాలం చెల్లిన తినుండారాలు, శీతల పానీయాలను మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవాలని, గడువు దాటిన వాటిని మార్కెట్లో విక్రయించే వారి డీలర్ షిప్ని రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల(లక్షెట్టిపేట) :