- మా కంపెనీ విత్తనాలు వేస్తే లాభాలు వస్తాయంటూ ప్రచారం…
- రైతులతో నోటిమాట ఒప్పందా లు…
- దిగుబడి రాకపోవడంతో ప్లేట్ ఫిరాయించిన సీడ్ కంపెనీ నిర్వాహకులు…
- మిగతా డబ్బుల కోసం రైతుల ఆందోళన
- పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు…
PRIVATE SEED COMPANY : అడుగడుగునా రైతు మోసానికి గురవుతూనే ఉన్నాడు. పండించిన పంటను విక్రయిద్దామంటే దళారీ తూకంలో కోతతో, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుందామంటే 40 కిలోల బస్తాకు తాలు, తప్ప పేరిట రెండు నుంచి మూడు కిలోలు అధనంగా జోకుతూ రైతన్నలను నట్టేట ముంచుతుండ్రు. ప్రైవేటు సీడ్ కంపనీలు మేమేం తక్కువ కాదంటూ రైతులకు మొదట చెప్పిన విధంగా డబ్బులివ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్న వైనం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో సంభవించింది.
ప్రైవేట్ సీడ్ కంపెనీ మోసం…
ప్రైవేట్ సీడ్ కంపెనీ మోసపూరిత వ్యవహారంతో రైతులు న్యాయం కోసం గురు వారం రోడ్డెక్కిన సంఘటన ఓదెల మండలం కనగర్తిలో చోటు చేసుకుంది. ఈ ఏడు వానా కాలం(ఖరీఫ్ సీజన్) లో ఐటీసీ అనే ప్రైవేటు సీడ్ కంపెనీ రైతులకు సీడ్ ఇచ్చి పండిన పంటను తామే కొనుగోలు చేస్తామంటూ కంపెనీ ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల ద్వారా వ్యాపారం ప్రారంభించింది. ఈ మేరకు రైతులతో సదరు కంపెనీతో ఒప్పందం చేయించుకొని ఈ కంపెనీ విత్తనాలు సుమారు 60 ఎకరాల్లో 22 మంది రైతులకు ఇచ్చి సాగు చేయించింది. కంపెనీ ప్రతినిధులు ఎకరాకు 10 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని, ఈ ధాన్యానికి క్వింటాలుకు రూ. 11 వేలు చెల్లించి తామే తీసుకుంటామని రైతులను మెప్పించింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్లే రావడంతో మోసపోయినట్లు గుర్తించిన రైతులు కంపెనీ ఆర్గనైజర్ ను ఆశ్రయించారు.
వంటావార్పుతో రైతుల నిరసన.. వ్యాన్ ముట్టడి…
జరిగిన నష్టానికి సంబంధించి మొత్తం డబ్బులను ఇప్పించాలని రైతులు కంపనీ ఆర్గనైజర్ ను కోరగా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు న్యాయం కోసం గురువారం (ఈ నెల 8న) ఆ కంపెనీ వ్యాన్ ను ముట్టడించారు. రోడ్డుపైనే వంటా, వార్పు నిర్వహించి నిరసనకు దిగారు. 22 మంది రైతులకు సుమారు రూ.36 లక్షల విలువైన పంటను కంపెనీకి సరఫరా చేసినప్పటికీ, ఇప్పటి వరకు కేవలం రూ. 22 లక్షలే చెల్లించారని వాపోయారు. మిగిలిన రూ. 14 లక్షల గురించి అడిగితే అధికారులు తప్పించుకుంటున్నారని, దీనితో కంపెనీ వ్యాన్ను నిలిపివేసి న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని బోరున విలపించారు.
న్యాయం కోసం ఠాణా మెట్లు ఎక్కిన రైతులు..
ప్రైవేటు సీడ్ కంపెనీలు తమను మోసం చేయాలని చూస్తున్నాయని తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు శుక్ర వారం కనగర్తి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి సీడ్ కంపెనీపై విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. “పంట పెట్టి అప్పుల పాలయ్యాం.. ఇప్పుడు మా డబ్బుల కోసం పడుతున్న బాధలు ఎవరి కంటబడటం..?” లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

చెప్పింది ఒకటి.. అమలు చేసింది మరోటి… – తాటిపెల్లి శ్రీనివాస్ రైతు , కనగర్తి
కంపెనీ వాళ్లు ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న మాట మీదే తాము పంటను వేసినం. క్వింటాలకు రూ. 11 వేలు చెల్లిస్తామన్నారు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు లేదా వాతావరణం అనుకూలించకపోతే ఒక్క ఎకరానికి రూ. 60 వేలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కేవలం 2–3 క్వింటాళ్లు మాత్రమే పంట వచ్చింది, నష్టం జరిగిన పంటకు తమకు న్యాయం చేయకుండా ఎగబెట్టి వెళ్లిపోతుండ్రు. మొదట ఒకటి చెప్పి.. తర్వాత ప్లేటు ఫిరాయిస్తుండ్రు. మాకు న్యాయం చేయాలి.

సీడ్ కంపెనీ మోసం చేయాలని చూస్తుంది: పెద్దిరెడ్డి శ్రీనివాస్ రైతు , కనగర్తి
సీడ్ కంపనీలు, ఏజెంట్ల చేతి వాటంతో మాకు అన్యాయం జరిగింది. ఆర్గనైజర్లు మొదట్ల ఒకలా చెప్పి ఆఖర్ల మాట తప్పుతుండ్రు. దీనితో లక్షల్లో నష్టపోవాల్సి వస్తోంది. పాత ఏజెంట్ పోయి కొత్త ఏజెంట్ వచ్చి ఇప్పుడేమో నాకు సంబంధం లేదంటుండు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మాకు కంపనీ వల్ల జరిగిన నష్ట పరిహారాన్ని ఇప్పించి న్యాయం చేయాలి. వరంగల్ లోని ఐ టి సి కంపెనీకి శనివారం రోజున మా రైతులను చేర్చలకు రమ్మన్నారు . ఒక్క వేళా అక్కడా మాకు న్యాయం జరగకుంటే కంపెనీ ముందే నిరసనకు సైతం దిగుతాం
నా దృష్టికి రాలేదు: ఏఈఓ కనగర్తి ..
సీడ్ కంపెనీ ఒప్పందం చేసుకున్నట్టు కానీ, సీడ్ వేసినట్టు కూడా నా దృష్టికి రాలేదు.
– శెనార్తి మీడియా, కరీంనగర్ ప్రతినిధి