- 14 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ విద్యాసంస్థ ఆక్రమణ..
- తక్షణమే చర్యలు తీసుకోకపోతే సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం..
ENCROACHMENT OF GOVT. LAND IN NUSTULAPUR : తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలోని 574 సర్వే నెంబర్ లో గల 14 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమిని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ అక్రమంగా ఆక్రమించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (CPI DIST. SECRETARY PANJALA SRINIVAS) ఆరోపించారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆ భూమిలో కళాశాల భవనాలు నిర్మించి, విద్యాసంస్థ నడుపుతున్నప్పటికీ అధికారులు నిశ్శబ్దంగా ఉండటం తీవ్రంగా ఖండించారు. 2012లో తహసీల్దార్ 13 ఎకరాల 18 గుంటల భూమిని ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చాలని సూచించినా, దాన్ని పూర్తిగా విస్మరించి 574 సర్వే నెంబరును 8 బై నెంబర్లుగా విభజించి ఖాతాలు సృష్టించారని తెలిపారు. 574/2లో జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన కార్యాలయం (JYOTISHMATI ENGINEERING COLLEGE HEADQUARTERS), మిగతా బై నెంబర్లలో కళాశాల భవనాలు ఉన్నట్లు ఇస్రో శాటిలైట్ మ్యాప్ ద్వారా తేలిందని పేర్కొన్నారు. కేవలం 574/8 లో మాత్రమే 30 గుంటల భూమి ప్రొహిబిటెడ్ జాబితాలో ఉండగా, మిగతా భూమిని కూడా చేర్చాలన్నారు.
కోట్ల విలువైన భూమిని అక్రమంగా ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తక్షణమే సర్వే చేసి హద్దులు నిర్ణయించి భూమిని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల స్థలాల కోసం ఈ భూమిని కేటాయించాలని, లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో భారీ భూ పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, మామిడిపల్లి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్ ప్రతినిది :