భారత్ ప్రణాళికతో చైనా, పాకిస్తాన్ షాక్ అవ్వాల్సిందే!
India 5th generation fighter Jet: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్పై చేసిన దాడి, అనంతర పరిణామాలు తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణకు ముందుకొచ్చింది. ఈ సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నది. ముఖ్యంగా ఐదో తరం యుద్ధ విమానాల ఆవశ్యకతను కేంద్రం గుర్తించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోనే ఐదో తరం యుద్ధ విమానాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం భారతీయ సంస్థలకు అవకాశం కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇది ఇప్పటివరకు దేశంలో చేపట్టిన అతి పెద్ద రక్షణ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమంగా గుర్తింపు పొందుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఈ యుద్ధ విమానాలను తయారు చేయనున్నాయి.
దేశంలోనే ఐదో తరం ఫైటర్ జెట్ల తయారీ
ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (Aeronatical Devolopment Agency) ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’ (EoI) విడుదల చేసింది. అంటే, యుద్ధ విమానాల తయారీలో నైపుణ్యం ఉన్న దేశీయ సంస్థల నుంచి ప్రతిపాదనలు కోరుతోంది. అర్హత ఉన్న సంస్థలు వచ్చే ఎనిమిదేళ్లలో ఐదో తరం యుద్ధ విమానాలను తయారు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ప్రకారం, 2030 మధ్య నాటికి ఈ విమానాలు భారత వాయుసేనలో ప్రధాన శక్తిగా మారనున్నాయి.
కేంద్రం కీలక నిర్ణయం
ఈ ప్రాజెక్ట్లో భాగంగా పాల్గొనదలచిన సంస్థలు తమ ప్రతిపాదనలను సమర్పించాలి. అవి AMCA రూపకల్పనపై అవగాహనతోపాటు, తయారీ, పరీక్షలు, ప్రమాణీకరణ వంటి అనుభవాన్ని చూపించాలి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు అభివృద్ధి, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ రంగాల్లో అనుభవం తప్పనిసరి.
భారతీయ సంస్థలపై భారీ బాధ్యత
యుద్ధ విమానాల్లో అవసరమైన పరికరాలు అమర్చే బాధ్యత సంస్థలపైనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సందేహాల నివృత్తికి జూలై తొలి వారంలో సమావేశం నిర్వహించనున్నారు. ప్రాజెక్ట్లో పాల్గొనదలచిన సంస్థలు వచ్చే ఆగస్టు 16నాటికి తమ ప్రతిపాదనలు సమర్పించాలి.
2030 నాటికి వాయుసేనలో కొత్త ఆయుధం
ఈ ఐదో తరం యుద్ధ విమానాలను తయారుచేయడానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇది ప్రోటోటైప్ తయారీకి మాత్రమే. విమానం పూర్తిస్థాయిలో రూపొందిన తర్వాత మరింత మౌలిక సదుపాయాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశముంది.
HAL, L&T సహా దిగ్గజ సంస్థలపై దృష్టి
ఈ భారీ ప్రాజెక్ట్ను దృష్టిలో ఉంచుకొని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అదానీ డిఫెన్స్, లార్సన్ అండ్ టుబ్రో (L&T) లాంటి సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ సంస్థలు కలిసి కన్సోర్షియం రూపంలో ప్రాజెక్ట్కు దరఖాస్తు చేయవచ్చు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఈ ప్రాజెక్ట్ను దేశంలోనే అతి పెద్ద రక్షణ పరిశోధన కార్యక్రమంగా ప్రభుత్వం ప్రకటించింది. రక్షణ రంగంలో భారత్ ఆత్మనిర్భరత సాధించాలన్నదే ప్రభుత్వ ఆశయం. ఈ ప్రాజెక్ట్ ఆ దిశగా ఒక పెద్ద అడుగుగా పరిగణించవచ్చు.
చైనా – పాకిస్తాన్ వణికే రోజులు దగ్గరలోనే!
దేశంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలు తయారవుతాయంటే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తక్కువవుతుంది. ఈ ఐదో తరం ఫైటర్ జెట్లు పూర్తి స్థాయిలో పనిచేసే నాటికి చైనా, పాకిస్తాన్ వంటి శత్రు దేశాల ఉక్కిరిబిక్కిరి ఖాయం!