brs
brs

BRS: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీస్ కేసులా?

  • దాడులు చేయిస్తున్నదే కాంగ్రెస్ నాయకులు
  • మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
  • రామగుండం సీపీకి ఫిర్యాదు

BRS: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారని, దాడులు చేయిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎలాంటి చర్యలు లేవని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝాకు ఫిర్యాదు చేసిన అనంతరం మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిపి కొప్పుల మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తారస్థాయికి చేరిందని విమర్శించారు. ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేమ్ సాగర్ రావు తన గ్యాంగ్‌లతో కలిసి గంజాయి బ్యాచ్‌లను ఉసిగొల్పుతూ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల బీఆర్‌ఎస్ నాయకుడు దగ్గుల మధుపై దాడి చేశారని, అతని తల పగులగొట్టి అదే వ్యక్తిపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అలాగే గత వినాయక చవితి సందర్భంగా గడప రాకేష్, కందుల ప్రశాంత్‌లపై దాడులు చేసి వారిపైనే అక్రమ కేసులు పెట్టారని తెలిపారు.

ఏసీపీ ప్రవర్తనపై మీడియా ఆగ్రహం
ఈ ఘటనలపై ఫిర్యాదుకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలతో మాట్లాడేందుకు మీడియా అక్కడకు చేరుకోగా, ఓ ఏసీపీ స్థాయి అధికారి మీడియాను బయటకు పంపించాలంటూ ఆదేశాలు ఇవ్వడం తో చర్చనీయాంశమైంది. మీడియా సిబ్బంది వ్యతిరేకించడంతో చివరకు పోలీసులు వెనక్కి తగ్గారు.

పదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడలేదని, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందించామని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రోత్సాహంతో తమ కార్యకర్తలపై దాడులు, కేసులు పెడుతున్నారని, అవసరమైతే ఎన్ని కేసులైనా భరించేందుకు సిద్ధమని, ఈ దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు అచ్చే వేణు, మెతుకు దేవరాజు, బొడ్డు రవీందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కిరణ్ జీ,పాలడుగుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల/గోదావరిఖని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *