మహిళలు, బాలికల విద్యాసంస్థలు, హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు తప్పనిసరి:
మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
Protection: బాలికల, మహిళల రక్షణ, భద్రత మంచిర్యాల జోన్ పోలీస్ ప్రధాన బాధ్యత, లక్ష్యం అని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ పేర్కొన్నారు. రామగుండం సీపీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ మహిళా కళాశాలల ప్రిన్సిపాళ్లు, బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ బాలికల, మహిళా వసతి గృహాల నిర్వాహకులు, వార్డెన్లతె బుధవారం సమావేశమయ్యారు.
హాస్టళ్లలో తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను డీసీపీ వివరించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత , సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, పలు సూచనలు చేశారు. హాస్టళ్లలో తప్పనిసరిగా సీసీ టీవీ కెమెరాలు 30 రోజుల నిడివి సామర్థ్యం కలిగినవి ఏర్పాటు చేసుకోవాలన్నారు. రిసెప్షన్, కారిడార్, నలువైపులా పరిసరాలు క్షుణ్ణంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్టల్ పరిసరాలు వెలుతురు కలిగి ఉండాలని, హాస్టల్ లో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి సమాచారం కలిగి ఉండాలని ఆదేశించారు. అదే విధంగా బాలికల ప్రవర్తన, వారి కదలికలు గమనించాలని సూచించారు. వారితో ప్రేమగా మాట్లాడి వారి మానసిక ప్రవర్తనను అబ్జర్వ్ చేయాలన్నారు.
ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇబ్బందికరమైన లేదా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా, వసతి గృహల ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా.. ఇబ్బందులకు గురిచేస్తున్నారనే సమాచారం తెలిసినా వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉంటారనే భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల ఇన్ స్పెక్టర్ ఎస్.ప్రమోద్ రావు, షీ టీమ్ ఇన్చార్జి హైమ పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
