CS VC
వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇరిగేషన్ అధికారులు

CS VC : చివరి ఆయకట్టు వరకు సాగు నీరందేలా పటిష్ట చర్యలు

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
  • రాబోయే 10 రోజులు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరా పర్యవేక్షించాలి
  • రిజర్వాయర్ల నుంచి విడుదల చేసే నీటిని సమర్థవంతంగా వినియోగించాలి
  • యాసంగి సాగు నీటి సరఫరా, గురుకులాల సందర్శనపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

CS VC : చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగు నీరు సరఫరా అందెలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం యాసంగి సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పని తీరు, సంక్షేమ హాస్టళ్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రణపై ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ యాసంగి పంట సంరక్షణకు రాబోయే పది రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు, విద్యుత్తు సరఫరా అవసరమైన మేర పొలాలకు చేరేలా చూడాలని, వ్యవసాయ శాఖకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని సిఎస్ విద్యుత్ అధికారులను ఆదేశించారు.

రిజర్వాయర్ల నుంచి విడుదల చేసే నీటిని సమర్థవంతంగా వినియోగించాలి
భారీ నీటి పారుదల శాఖ పరిధిలోని రిజర్వాయర్లలో అవసరమైన మేర సాగునీరు అందుబాటులో ఉందని, పంటలకు సమృద్ధిగా నీరు విడుదల చేయడం జరుగుతుందని, విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. యాసంగిలో 77 లక్షల ఎకరాలలో సాగు జరుగుతోందని, ముఖ్యంగా వరి పంట 54.82 లక్షల ఎకరాల సాగు జరిగిందని, గత సంవత్సరం కంటే 2 లక్షల 70 వేల ఎకరాలు వరి, లక్ష ఎకరాల మొక్కజొన్న పంట అధికంగా పండుతుందని అన్నారు. సిద్దిపేట, జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి  మొదలగు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయని వీటిని పక్కగా పర్యవేక్షిస్తూ  పొలాలు ఎండిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.

చివరి ఆయకట్టు వరకు సాగు నీరందేలా చూడాలి
చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు రాక పోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల కొంత మేరకు రైతులు ఇబ్బందులకు గురి కావడం గమనించామని సీఎస్ అన్నారు.  ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఎస్సారెస్పీ, ఎస్సారెస్పీ స్టేజి 2, నాగార్జున సాగర్, ఏఎంఆర్ లిఫ్ట్ , కల్వకుర్తి , ఇతర ప్రాజెక్టుల కింద నిర్దేశిత పంట పొలాలకు సాగునీరు అందాలని సీఎస్ తెలిపారు.  రాబోయే 10 రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి వచ్చే డిమాండ్ అనుగుణంగా సాగునీరు విడుదల చేస్తూ  రైతుల పొలాలు ఎండిపోకుండా కాపాడాలని సీఎస్ ఆదేశించారు.

VC CS
వీసీలో మాట్లాడుతున్న సీఎస్ శాంతి కుమారి

సన్నద్ధంగా ఉండాలి
ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి  విద్యుత్ సరఫరా ఎక్కడ లోటు రాకుండా చూసుకోవాలని సీఎస్ డిస్కం అధికారులకు సీఎస్ సూచించారు. ప్రస్తుతం ఉన్న పీక్ డిమాండ్ కు మరో 10 నుంచి 15 శాతం పెరిగినా తట్టుకునెలా విద్యుత్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని సీఎస్ పేర్కొన్నారు. సాగు నీరు సరఫరా, పంటల పరిస్థితుల పై పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు స్పందించాలని, రైతులు ఆందోళనకు గురికాకుండా సమృద్ధిగా సాగు నీటి సరఫరా అవుతుందని భరోసా కల్పించాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని అన్నారు.

రాబోయే 10 రోజులు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరా పర్యవేక్షించాలి
రాబోయే 10 రోజులపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ లెవెల్ లో రైతులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సీఎస్ శాంతి కుమారి అన్నారు. సాగు నీరు ఇబ్బందులు ఏర్పడే జిల్లాలలో మండలాల వారీగా తహసిల్దార్, నీటిపారుదల శాఖ ఇంజనీర్, వ్యవసాయ అధికారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటించాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ ల తనిఖీ తర్వాత పరిస్థితులలో మార్పులు వచ్చాయని, పిల్లలకు అందించే ఆహార నాణ్యత పెరిగిందని, కామన్ మెన్యూ డైట్ పక్కాగా అమలు అవుతుందని అన్నారు. సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ నిషేధం సంబంధించి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల ప్రతినిధి :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *