- ఆపరేషన్ సింధూర్ కు వీరతిలకం దిద్దిన మహిళా కమాండర్లు
- ఎలా పూర్తయ్యిందో వెల్లడించిన మహిళా కమాండర్లు..
- ఆ ఇద్దరి కోసం సెర్చ్ చేస్తున్న నెటిజన్లు
Operation Nari Shakthi: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మొత్తం 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినప్పటి నుంచి భారతీయులు ప్రతీకార చర్య ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తుననారు. ఆ దాడి జరిగినప్పటి నుండి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై సగటు భారతీయుల్లో కోపం మరింత పెరుగుతూ వస్తున్నది. ఈ దాడి జరిగిన 15 రోజుల తర్వాత ఇప్పుడు భారత్ తన ప్రతీకారం తీర్చుకుంది. భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాటాక పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిదికి పైగా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా దాడి చేసి, ఆ దేశానికి తగిన సమాధానం ఇచ్చింది. దాడి జరిగిన వెంటనే, పాకిస్తాన్ గగ్గోలు పెడుతున్నది. ప్రపంచానికి తాము బాధితులం అని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నది. కానీ భారత సైన్యం- విదేశాంగ మంత్రిత్వ శాఖ దాయాది దేశం చెబుతున్న ప్రతి అబద్ధాన్ని ప్రపంచం ముందు ఆధారాలతో సహ బట్ట బయలు చేస్తున్నాయి.
‘ఆపరేషన్ సిందూర్’ కు సంబంధించి బుధవారం భారతదేశం నిర్వహించిన అధికారిక విలేకరుల సమావేశంలో, ముగ్గురు ప్రధాన వ్యక్తులు వచ్చి వివరాలు వెల్లడించారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఇద్దరు మహిళా సైనిక అధికారులు ఆయన వెంట ఉన్నారు. మొదటి కల్నల్ సోఫియా ఖురేషి, రెండో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ ఇద్దరు మహిళా అధికారులు భారత సైన్యం పరాక్రమాన్ని ప్రపంచానికి వివరించారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ఎలా నిర్మూలిస్తుందో కూలంకశంగా వెల్లడించారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళా అధికారుల గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. దేశమంతా ప్రస్తుతం వారి గురించే చర్చ జరుగుతోంది. ప్రతి భారతీయుడు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి ఆ ఇద్దరు అధికారులు ఎవరు? భారత సైన్యం, భారత ప్రభుత్వం ఈ ముఖ్యమైన విలేకరుల సమావేశానికి వారిని ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకుందాం.
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్
డిసెంబర్ 18, 2004న భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా వ్యోమిక సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత కాలంలో అత్యుత్తమ వింగ్ కమాండర్లలో వ్యోమికా సింగ్ ఒకరు. ఫైటర్ హెలికాప్టర్లను ఎగరవేయడంలో అద్భుతమైన అనుభవం ఆమె సొంతం. చీతా, చేతక్ వంటి ఫైటర్ హెలికాప్టర్లను ఎగరవేయడంలో ఎంతో నైపుణ్యం సాధించారు. వైమానిక దళంలో చేరిన 13 సంవత్సరాల తర్వాత వ్యోమిక సింగ్ వింగ్ కమాండర్ హోదా పొందారు 18 డిసెంబర్ 2017న ఆమె వింగ్ కమాండర్ అయ్యారు.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎంతో అనుభవం గడించారు. ఈ అనుభవం తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేలా చేసింది. వ్యోమిక సింగ్ తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు, వైమానిక దళంలో చేరాలని అనుకున్నారు. వ్యోమికా సింగ్ ప్రకారం, చదువు పూర్తయ్యే సమయానికి మహిళలు వైమానిక దళంలో చేరింది చాలా తక్కువే. యూపీఎస్సీ ద్వారా వైమానిక దళంలో చేరి, ఆ తర్వాత హెలికాప్టర్ పైలట్ అయ్యారు. హెలికాప్టర్ పైలట్గా ఉండటం వల్ల చాలా కష్టమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని, ఈ నిర్ణయాలు తనను మరింత బలోపేతం చేశాయని వ్యోమిక సింగ్ అన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఫైటర్ హెలికాప్టర్ను నడిపే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా, 2021 సంవత్సరంలో మణిరాంగ్ పర్వతాన్ని అధిరోహించిన వైమానిక దళ మహిళా విభాగంలో కూడా భాగమై చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నారు.
కల్నల్ సోఫియా ఖురేషి
విలేకరుల సమావేశంలో హిందీలో పూర్తి సమాచారం ఇచ్చిన కల్నల్ సోఫియా ఖురేషి, పాకిస్తాన్ను ముక్కలు ముక్కలుగా చేసి, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల ప్రతి వివరాలను ప్రపంచం ముందు ప్రదర్శించారు. సోఫియా ఖురేషి కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ కు అనుబంధంగా ఉన్న అధికారి. 35 ఏళ్ల సోఫియా ఖురేషి ప్రస్తుతం బహుళ దేశాల సైనిక విన్యాసాలలో భారత సైన్యం మొత్తం బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి.
2016 సంవత్సరంలో ఆమె ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 మిలిటరీ డ్రిల్లో భాగమయ్యారు. నాయకత్వం కూడా వహించారు. గుజరాత్ యు చెందిన సోఫియా ఖురేషి సైనిక కుటుంబం నుంచి వచ్చింది. బయోకెమిస్ట్రీలో డిగ్రీ కూడా పొందారు. దాదాపు 6 సంవత్సరాలుగా ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్లో భారతదేశం తరపున సహకారం అందించారు కాంగోలో మిషన్ను పూర్తి చేశారు.
15 రోజులకు ప్రతీకారం
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి అనంతరం భారతదేశంలో పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ఆ దేశానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముంబై 26/11 దాడి తర్వాత, భారీ ఉగ్రవాద దాడి ఇదే.. ఈ సంఘటన జరిగిన 15 రోజులకు భారతదేశం తన ప్రతీకారం తీర్చుకుంది. మే 6( మంగళవారం అర్ధరాత్రి దాటాక) భారత వైమానిక దళం పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పలు ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసుకొని దాడికి దిగింది. ఈ ఆపరేషన్ కు భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది