- రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
HOLI CELEBRATIONS : హోలీ (HOLI) పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ (CP) అంబర్ కిశోర్ ఝా సూచించారు. గురు వారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. హోలీ సందర్భంగా ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదని, మహిళల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం ఎంత మాత్రం అనుమతించబడదని స్పష్టం చేశారు.
లోతట్టు ప్రాంతాలకు స్నానాలకు వెళ్లవద్దు…
హోలీ పండుగ అనంతరం చెరువులు, గోదావరి నదీ, ప్రాణహిత నదీ తీరాల్లో లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో, వ్యక్తులపై రంగులు చల్లడం, గుంపులుగా తిరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు రామగుండం కమిషనరేట్ (CP) పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. స్నేహ పూర్వక వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల / గోదావరి ఖని :