బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం
పదవి కోసం అధినేత కేసీఆర్ వద్దకు ఆశావహుల క్యూ
బీసీకా, ఎస్సీ,ఎస్టీలకా..? తేల్చుకోలేకపోతున్న అధిష్టానం..
రెండో స్థానంలోనూ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్లాన్
BRS boss Kcr : తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు(MLC Elections) ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29కి బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంఐఎం(MIM) ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ సారి బీఆర్ఎస్కు కేవలం ఒక్క ఎమ్మెల్సీ స్థానం మాత్రమే దక్కనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తారనేది పొలిటిలక్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక స్థానం దక్కనుంది. దీంతో గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దూరమైన ఓటు బ్యాంకును చేరువ చేసుకోవడానకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ వర్గం నేతల్లో ఒకరికి కేటాయిస్తారనే చర్చ జరుగుతుంది. దీంతో ఆయా వర్గాలకు చెందిన నేతలు బీఆర్ఎస్ బాస్ను కలిసేందుకు ఫాంహౌస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రేసులో దాసోజు, సత్యవతి రాథోడ్, ఆర్ఎస్పీ పేర్లు వినిపిస్తున్నాయి. పలువురు మాజీలు సైతం ఈ పదవిపై ఆశలు పెట్టుకుని పావులు కదుపుతున్నారని టాక్ నడుస్తున్నది.
ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29న బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ సారి బీఆర్ఎస్కు కేవలం ఒక్క ఎమ్మెల్సీ స్థానం మాత్రం దక్కనుంది . ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కుతుందోనని చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఒక్క స్థానానికి మాత్రమే అవకాశం ఉండడంతో పోటీ కూడా తీవ్రంగా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉండనున్నాయి. బీసీకి ఇస్తారా.. లేక ఎస్సీకి ఇస్తారా? అనే చర్చ కూడా గులాబీ పార్టీలో జోరుగా సాగుతున్నది. ఇప్పటికే పలువురు ఆశావహులు ఫాంహౌస్లో ఉంటున్న అధినేత ఆశీస్సుల కోసం క్యూ కడుతున్నారని సమాచారం. ఎస్టీకి మరోసారి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పోటీ పడుతున్న సీనియర్లు
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా (MLA Quota) ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఖాళీ అవుతున్న ఆ ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి.. ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా కేవలం ఒక స్థానం మాత్రమే దక్కనుంది. దీంతో ఆ స్థానం కోసం పార్టీలో పని చేస్తున్న సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేత కేసీఆర్ ఉంటున్న ఎర్రవెల్లి ఫాం హౌస్ కు సైతం వెళ్లి కలిసి వస్తున్నట్లు పార్టీలో పలువురు చర్చించుకుంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు కేసీఆర్కు విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్కు అత్యంత సన్నిహితులతోనూ వారు మంతనాలు చేస్తున్నారు. తమకు ఎమ్మెల్సీ సీటు వచ్చేలా చూడాలని కేటీఆర్, కవిత, హరీష్ రావుల తోను విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎవరికి వారుగా ఆశావాహులు లాబీయింగులు మొదలుపెట్టారు.
గులాబీ పార్టీ బీసీ రాగం
ఒక్క స్థానం మాత్రమే ఉండడంతో ఏ వర్గానికి టికెట్ ఇస్తారనే విషయమై పార్టీలో జోరుగా చర్చ సాగుతున్నది. కారు పార్టీ ప్రస్తుతం కొద్ది రోజులగా బీసీ రాగం వినిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42శాతం రిజర్వేషన్ కల్పించాని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా? లేకుంటే బీఆర్ఎస్ కేవలం బీసీ వాదానికే పరిమితం అవుతుందా? అనేది హాట్ టాపిక్గా మారింది. ఇక వెనకబడిన వర్గాల నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.
అధినేత దగ్గరకు ఆశావహుల క్యూ..
శ్రావణ్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని గులాబీ బాస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హామీ కూడా ఇచ్చారు. అప్పటి గవర్నర్ తమిళిసైకి దాసోజు శ్రావణ్ పేరు కూడా చేర్చి జాబితా పంపించగా ఆమె తిరస్కరించారు. అప్పటి నుంచి దాసోజుకు పదవుల పరంగా అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో ఈ సారి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా నడుస్తున్నది. బీసీ కోటాలో దాసోజుతో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీలు వీజీగౌడ్, స్వామిగౌడ్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఒక్క స్థానం కోసం పోటీ
ఎస్టీ సామాజిక వర్గం నుంచి పదవీ కాలం ముగియనున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తిరిగి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కేసీఆర్తోపాటు కేటీఆర్ను సైతం ఈ విషయమై కలిసినట్లు సమాచారం. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, మైనార్టీల నుంచి మాజీ మంత్రి మహమూద్ అలీ, సీనియర్ నాయకుడు సలీం సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారని టాక్. వీరుకాకుండా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ స్థానం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నది. .
రెండో స్థానానికి పోటీచేయాలా..వద్దా?
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఇద్దరు అభ్యర్థులను నిలిపే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం కూడా నడుస్తున్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులకు సరిపడా బలం లేదు. అయినా రెండో స్థానానికి పోటీ చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ పక్కా స్కెచ్ గీస్తున్నది సమాచారం. ఆ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. వారికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నదట. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి గులాబీ పార్టీ న్యాయపోరాటం కూడా చేస్తున్నది. పార్టీ మారిన వారు ఈ ఎన్నికల్లో విప్ను ఉల్లంఘిస్తే దానిని కోర్టులో తమకు అస్త్రంగా మలుచుకోవాలన్నది బీఆర్ఎస్ బాస్ ఆలోచన అని టాక్. మరి కారు పార్టీ లెక్కలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సిందే.