కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
Bhavitha Centres : ప్రత్యేక అవసరాలు గల పిల్లల భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భవిత సెంటర్లను ఆధునీకరించి, గ్రాండ్ లుక్ లో రూపొందించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ముకరంపులోని భవిత సెంటర్ను శనివారం సాయంత్రం కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సందర్శించారు. జిల్లాలో 16 భవిత సెంటర్లను ఆధునీకరించే ప్రణాళిక నేపథ్యంలో వారు భవిత సెంటర్ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముకరంపుర భవిత సెంటర్ను మోడల్గా తయారుచేసి గ్రాండ్ లుక్తో తీర్చిదిద్దాలని, ఇతర సెంటర్లకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, వారికి సమగ్ర సదుపాయాలు కల్పించాలని ఆమె అధికారులకు ఆదేశించారు.
భవిత సెంటర్ల అభివృద్ధిలో భాగంగా వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఆకర్షణీయమైన ప్లేవే మెటీరియల్ అందుబాటులో ఉంచాలని, చదువుకోవడానికి, ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంపొందించేలా భవిత సెంటర్ల వాతావరణం ఉండాలని ఆమె పేర్కొన్నారు.

“ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో మానసిక ధైర్యం పెంపొందించేందుకు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ తోడు నిలవాలి. వారిని సొంత బిడ్డల్లా చూసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు నడిపించాలి,” అని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు.
భవిత సెంటర్ల ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, త్వరగా పిల్లల కోసం అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భవిత సెంటర్ల అభివృద్ధి కోసం తాము నిరంతరం అండగా ఉండనున్నామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, జిసి డివో కృపారాణి, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కురి శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, కరీంనగర్