- అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి..
TRAFFIC PROBLEM : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరులోని (PACHUNURU VILLAGE) ఫోర్ లైన్ రోడ్డుపై ఇసుక లారీల అల్లరి ప్రజల జీవితాలను కాటేస్తోంది. ఊటూరు ఇసుక రీచ్ నిర్వాహకులు, దళారుల ఇష్టారాజ్యానికి ట్రాఫిక్ గందరగోళం రాజకీయం కొనసాగుతోంది. రహదారులు లారీ పార్కింగ్ స్థలాలుగా మారిపోవడంతో ప్రజలు రోడ్ల మీద నరకయాతన అనుభవిస్తున్నారు.
- ఐకేపీ సెంటర్ దళారుల దోపిడీ కేంద్రంగా మారింది…
పచ్చునూరు ఐకేపీ సెంటర్ ప్రభుత్వ స్థలం పేరుతో వసూళ్ల దందా నడుస్తోంది. లారీ పార్కింగ్ కోసం దళారులు ఒక్కో లారీ నుంచి రూ. 100 నుంచి రూ. 200 వసూలు చేస్తూ, తమ జేబులు నింపుకుంటున్నారు. ఈ దోపిడీకి ప్రభుత్వ అధికారుల మౌనమే ప్రోత్సాహమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- రైతులకు ద్రోహం: దళారుల దోపిడీ రాజ్యమేలుతుంది…
రైతుల భూములను లీజుకు తీసుకున్న వ్యవస్థను పక్కనబెట్టి, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం దళారుల ఆగడాలకు తార్కాణంగా నిలుస్తోంది. రైతులు ఆదాయం కోల్పోతుండగా, దళారులు లాభాలతో పండుగ చేసుకుంటున్నారు.
- రహదారులు రాక్షసులుగా మారిన లారీలకు బందీ…
లారీ డ్రైవర్లు రోడ్ల మీద పార్కింగ్ చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలను పాతరేస్తున్నారు. పాదచారులు, వాహనదారులు రోడ్ల మీద ఆహారానికే వెళ్లడం గగనంగా మారింది. రాత్రింబవళ్లు లారీల హారన్ మోతతో గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. ప్రజలు శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
- అధికారుల మౌనం: అక్రమార్కులకు దారి…
ఇసుక లారీలకు అధికారులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లు ఆక్రమణకు గురవుతుండగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- ప్రజల హెచ్చరిక…
ఈ విధంగా కొనసాగితే ప్రజలు నేరుగా ఉద్యమిస్తారని, అధికారుల కదలికల కోసం ఎక్కువ కాలం వేచి ఉండబోమని స్పష్టం చేస్తున్నారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయకుంటే, ప్రజల ఆగ్రహానికి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. పచ్చునూరు ప్రజలకు న్యాయం చేయాలంటే, వెంటనే ఈ దోపిడీ వ్యవస్థకు అంతం చెప్పి ప్రజా ప్రయోజనాలను కాపాడాలి.
– శెనార్తి మీడియా, కరీంనగర్ ప్రతినిధి :