- వీణవంక నుంచి మానకొండూర్ దాకా లారీల శబ్దాల మోత..
- అవస్థలు పడుతున్న రెండు మండలాల ప్రజలు..
- పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ శాఖలు..
NO SIDE TO AMBULANCE : కరీంనగర్ జిల్లా మానకొండూరు, వీణవంక మండలాల్లోని ఇసుక రీచ్ లు ప్రజల ప్రాణాల పాలిత యమదూతలుగా మారాయి. ఈ రెండు మండలాల్లోని ఇసుక రీచ్ ల నుంచి వస్తున్న లారీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దారిపోడవునా రెండు వైపులా లారీల రాకపోకలతో ట్రాఫిక్ అంతరాయం తలెత్తుతున్నది. ఇసుక లారీల కారణంగా ఇటీవల పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసకున్నాయి. తాజాగా మంగళవారం ఇసుక లారీలు రోడ్లను బ్లాక్ చేయడంతో రాకపోలకు అంతరాయం ఏర్పడింది. ఓ అంబులెన్స్ ఇసుక లారీల మధ్య చిక్కుకొని బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రెండు రోజులుగా సర్కులేట్ అవుతున్నది. ఇలా ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారినా జిల్లా ఉన్నతాధికారులు, అటు సంబంధింత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

- పరిమితికి మించి తరలింపు.. దిగబడుతున్న వాహనాలు..
ఇసుక లారీల్లో గరిష్ఠ పరిమితికి మించిన లోడును తరలించడంతో రోడ్ల భూభాగం కుంగిపోతోంది. అధిక లోడుతో ప్రయాణిస్తున్న లారీల వల్ల రోడ్లు పాడై ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తి గంటల పాటు రాకపోకలు పూర్తిగా నిలిచి పోతున్నాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు.
- అతివేగం..
డ్రైవర్లు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారు కావడం, లోడింగ్ ఆలస్యం అవుతుండడంతో తిరిగి వెళ్లే సమయంలో అతి వేగంగా వాహనాలు నడుపుతున్నారు. ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతున్నది. అధికారులు దృష్టి సారించి ఇసుక రవాణా వాహనాలపై చర్యలు తీసుకోవాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్ ప్రతినిధి :