- కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ అరెస్టు చేయించదు
- కాళేశ్వరం విషయంలో బీజేపీ స్టాండ్ ను విస్మరించి పార్టీలో ఎవరూ మాట్లాడినా అది తప్పే
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేసీఆర్ కుటుంబంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబానికి అండగా నిలుస్తున్నదనే విషయం స్పష్టమవుతున్నదని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి ఆధారాలు ఉన్నా ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణం ఇదేనని విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి ఉన్న బొమ్మ బొరుసులాంటివని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పుడు ఈ కుట్ర రాజకీయాలను అర్థం చేసుకున్నారని చెప్పారు.
ఎన్డీఎస్ఏపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి స్పందించారు. ఎన్డీఎస్ఏ రాజ్యాంగబద్ధ సంస్థ. అది ఏది పడితే అది రాసే సంస్థ కాదు. దాని స్వతంత్రతపై బురద చల్లొద్దని హెచ్చరించారు. కేసీఆర్ తనను తాను “పెద్ద ఇంజనీర్, డాక్టర్”గా చెప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
కేసీఆర్ పాలనలో మంత్రులకు విలువ లేకుండా పోయిందని, ఆయన అనుమతించకపోతే ఎవరూ మాట్లాడే సాహసం చేయలేకపోయారని పేర్కొన్నారు. కాళేశ్వరం సహా కీలక నిర్ణయాలన్నీ అప్పటి సీఎం కేసీఆర్ ఒక్కడే తీసుకున్నారన్నది నిస్సందేహమని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విచారణపై నమ్మకం లేదని, సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరపాలని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పిన విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేబినెట్ ఆమోదం, సబ్కమిటీ సిఫారసుల మేరకే కాళేశ్వరం నిర్మించాం అని చెప్పుకుంటున్నా, ఆ ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం వల్ల లాభాలేమీ లేవని, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని బీజేపీ అభిప్రాయపడుతోందని చెప్పారు.
తనపై ఫోన్ ట్యాపింగ్ జరిగినా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నా తన అభిప్రాయం మారలేదన్నారు. బీజేపీ స్టాండే నా స్టాండ్ అని స్పష్టం చేశారు.
కాళేశ్వరం వల్ల రాష్ట్రానికి లాభం కలిగిందని ప్రచారం చేసినప్పటికీ, వాస్తవంగా లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ముంపు, అవినీతి, వైఫల్యాలపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర మంత్రి ఉన్నా తన వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశారు. “రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రిని. అయినా నా స్టాండ్ మారలేదు. బీజేపీ స్టాండే నా స్టాండ్ అని మరోసారి స్పష్టం చేశారు.
ఈ సీజన్లో కాళేశ్వరం ద్వారా నీటి సరఫరా లేకపోయినా, పంట దిగుబడులు రికార్డు స్థాయిలో ఉన్నాయన్నారు. “ఇప్పటికీ పంట దిగుబడి పెరిగితే కాళేశ్వరం వల్ల ప్రయోజనం ఏమిటో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కేవలం డ్రామా మాత్రమేనని విమర్శించారు. “అవినీతి కేసుల్లో ఎంత ఉన్నా, ఆయనను అరెస్టు చేయకపోవడం దానికి నిదర్శనం,” అని తెలిపారు.
“తాము అధికారంలో ఉంటే కేసీఆర్ తో పాటు, అవినీతిపరులను ఇప్పటికే జైలుకు పంపించే వాళ్లమని తెలిపారు.
బీజేపీ కాళేశ్వరంపై తీసుకున్న స్థానం తుదితీర్పు అని, దానికి విరుద్ధంగా మాట్లాడే తమ పార్టీ నాయకుల వ్యాఖ్యలు తప్పేనని హెచ్చరించారు.