- గంగులను విమర్శించే నైతిక హక్కు లేదు: చల్ల హరిశంకర్
Challa Harishankar: అవినీతి తిమింగలం, అవినీతి అనకొండ, అవినీతి కేరాఫ్ అడ్రస్ మాజీ మేయర్ సునీల్ రావు అని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అన్నారు. మాజీమంత్రి, కరీంనగర్ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి, శాసనసభ్యుడు గంగుల కమలాకర్ను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడారు. అధికార దాహంతో పార్టీ మారిన వ్యక్తి సునీల్ రావు అని మండిపడ్డారు. గతంలో కరీంనగర్ పార్లమెంటుకు బండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తేలేదని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టిన సునీల్ రావు, ఇప్పుడు కరీంనగర్ అభివృద్ధి అంతా బండి సంజయ్ చొరవే అని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
బీఆర్ఎస్ మేయర్గా ఐదేళ్లు ఉండి పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేశాడని, ఆ కాలంలో ఎంత సంపాదించాడో, విదేశాల్లో కూడబెట్టిన ఆస్తుల వివరాలు త్వరలో బయటపెడతామన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వినోద్ కుమార్ వల్ల సాధ్యమైందని, ఆ సమయంలో బండి సంజయ్ కార్పొరేటర్ మాత్రమేనని ఎప్పటికప్పుడు చెప్పిన సునీల్ రావు ఇప్పుడు సంజయ్ జపం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
సునీల్ రావు కలెక్షన్లకు కేరాఫ్ అడ్రస్ అని, గంగుల చేసిన అభివృద్ధిపై విమర్శించే హక్కు అతనికి లేదని స్పష్టం చేశారు. ‘‘గంగులకు, సునీల్ రావుకు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంటుందని మండిపడ్డారు. మాజీ మేయర్ అవినీతి సంపాదన పట్ల ప్రజలకు ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తున్నదన్నారు.
బీజేపీలో నాయకులు లేక బండి సంజయ్ ఇతర పార్టీల వైపు చూస్తున్నాడని, అందుకే మాజీ మేయర్ సునీల్ రావును తీసుకుని మీడియా సమావేశం పెట్టించే స్థాయికి దిగజారారని తీవ్ర విమర్శలు గుప్పించారు. సంజయ్ సీటుకే సునీల్ రావు ఎసరు పెట్టే పరిస్థితి వచ్చిందని, జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బండి సంజయ్ అవగాహన లేక దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని, ప్రజలకు వారి చేష్టల వల్ల అర్థమవుతోందని హరిశంకర్ అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా, కరీంనగర్ పట్టణానికి ఒక్క రూపాయి ఇవ్వకపోవడం దారుణమన్నారు.
డంప్ యార్డు సమస్యపై ఇప్పటికీ పరిష్కారం లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా కరీంనగర్ అభివృద్ధికి కృషి చేయాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ను విమర్శించకుండా, తన చుట్టూ ఉన్న అవినీతి నేతలను తొలగించాలని బండి సంజయ్కు సూచించారు.