- వచ్చే నెల 25 నుంచి 27 వరకు జాతర
- భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలి
- పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి
- భద్రత అంశంలో పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీతో సమీక్ష
Mahashivarathri: మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా వేములవాడలో నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాతర నిర్వహించాలన్నారు. నిర్దేశించుకున్న పనులు జాతర సమయానికి సన్నద్ధమయ్యేలా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మహా శివరాత్రి జాతర సందర్భంగా అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, కల్యాణ కట్ట, ధర్మగుండం, బద్ది పోచమ్మ ఆలయం, హెల్ప్ సెంటర్ , సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు రూపొందించుకున్న ప్రణాళికను వివరించారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా, దైవికంగా నిబంధనలు పాటిస్తూ, ఎక్కడా చిన్న లోటు కూడా లేకుండా నిర్వహించాలని ప్రభుత్వ విప్ సూచించారు. ఫిబ్రవరి 26 న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు 3 రోజుల పాటు మాహా జాతర ను వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గత మహా శివరాత్రి ఉత్సవాలకు 2 లక్షల 50 వేల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుత సంవత్సరం 4 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ స్థాయిలో మనం జాతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి..
జాతరకు వచ్చే భక్తులకు నీడ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. జాతర సందర్భంగా సమీప మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి కార్మికులను సర్దుబాటు చేసుకోవాలన్నారు. జోన్ల వారీగా విభజించి పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు, పాలు అందించేలా దేవస్థాన సంస్థ ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్యూ లైన్లలో చేరిన భక్తులకు దర్శనం కోసం అధిక సమయం పట్టే నేపథ్యంలో వారికి పాలు అందించేలా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ సూచించారు. క్యూలైన్లలో వచ్చే భక్తులకు ప్రధాన ఆలయం ఎంటర్ కాకముందే అవసరమైన మేర టాయిలెట్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. టాయిలెట్స్ దగ్గర ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని కేటాయించి ప్రతి పదిహేను నిమిషాలకోసారి శుభ్రం చేసేలా చూడాలని అన్నారు.
శివరాత్రి జాతరకు ఏ ఒక్క భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగడానికి వీలు లేదని, ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు వేములవాడ కు గతం కంటే 30శాతం అధికంగా బస్సు సర్వీసులు నడపాలని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని ప్రభుత్వ విప్ సూచించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ అందించిన సూచనలు పాటిస్తూ అధికారులు వివిధ శాఖల మధ్య ఉన్న చిన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకొని పకడ్బందీగా జాతర నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనపు కళ్యాణ కట్టలు ఏర్పాటు చేయాలని, బద్ది పోచమ్మ ఆలయం , నాంపెల్లి ఆలయం వద్ద అదనపు క్యూ లైన్లు సిద్ధం చేయాలని, అవసరమైన భద్రత కల్పించాలని, విద్యుత్ అలంకరణ పనులు ఆకర్షణీయంగా చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రధాన ఆలయం, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్ ,జగిత్యాల రోడ్డు, పార్కింగ్ దగ్గర అవసరమైన హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహా జాతర సందర్భంగా వేములవాడ పరిసరాల్లో మద్యం విక్రయాలను నిషేధించాలని ఆదేశించారు. ఎస్పీ అఖీల్ మహాజన్ మాట్లాడుతూ ప్రసాదం కౌంటర్లు మరి కొన్ని చోట్ల కూడా పెట్టాలని సూచించారు. గతం కంటే ఎక్కువగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, అక్కడ పోలీసుల కోసం టెంట్, తాగునీటి సరఫరా ఉండాలన్నారు.
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు..
మహాశివరాత్రి జాతర సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను వేములవాడ ఆలయం ప్రధాన అర్చకుడు భీమ శంకర శర్మ వెల్లడించారు. వచ్చే నెల 25న రాత్రి 7గంటలకు ప్రభుత్వం, రాత్రి 7. 30 గంటలకు పట్టు వస్త్రాల సమర్పణ, టీటీడీ వారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 26న వేకువ జామున 12 నుంచి 2.30 గంటల వరకు పుర జనులకు సర్వదర్శనం ఉంటుందన్నారు. వేకువ జామున 2.30 నుంచి ఉదయం 3.30 గంటల వరకు ప్రజా ప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శనం ఉంటుందని, వేకువ జామున3.30 నుంచి 3.40 గంటల వరకు మంగళ వాయిద్యాల ప్రదర్శన, వేకువజామున 3.40 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాతం సేవ, ఆలయ శుద్ధి, వేకువ జామున 4.30 నుంచి 6 గంటల వరకు ప్రాతకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుందని వివరించారు. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శివదీక్ష స్వాముల దర్శనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మహా లింగార్చన (స్వామివారి కల్యాణ మండపంలో) అనువంశిక బ్రాహ్మణోత్తముల దర్శనం, రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ కాలంలో శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకం ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, ఈవో వినోద్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ప్రజా ప్రతినిధులు సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, వేములవాడ
Super