- మొసళ్ల అభయారణ్యంపై పట్టింపు కరువు
- అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం
- మందు బాబులకు అడ్డాగా మారుతున్న వైనం
Shivvaram: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ లోని శివ్వారం మొసళ్ల అభయారణ్యాన్ని అటు పాలకులు, ఇటు అధికారులు చిన్న చూపుచూస్తున్నారు. ఇక అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అభయారణ్యం కాస్త ఆకతాయిలకు, మందు బాబులకు అడ్డాగా మారింది. పర్యాటక కేంద్రంపై అటవీశాఖ అధికారుల పట్టింపుకరువైంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులకు నిరాశే మిగులుతోంది. కనీస వసతులు లేక సందర్శకులు రానురాను తగ్గిపోతున్నారు. బోటింగ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన స్టీల్ రెయిలింగ్ ఉడిపోయి ప్రమాదకరంగా మారింది.
కనిపించని బోట్లు
గత ప్రభుత్వం హంగూఆర్భాటాలతో ఈ అభయరణ్యంలో సౌకర్యాలు కల్పించినా ఇప్పుడవి కానరావడం లేదు. మొసళ్ల మడుగు వద్ద గతంలో ఏర్పాటు చేసిన బోట్లు కానరావడం లేదు. అసలు ఉన్నాయో లేవో కూడా తెలియడం లేదు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ప్రాంతంపై పర్యవేక్షన కరువైంది. దీంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నది. అటవీశాఖాధికారులు స్పందించి ఆకతాయిలను అరికట్టి, సౌకర్యాలు కల్పించేంద దిశగా చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
